Stock Market IT Shares: స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో భారీ అమ్మకాలతో సూచీలు నష్టాలు చూశాయి. అమెరికాలో జనవరి నెలలో భారీగా ఉద్యోగాలు రావడంతో మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపింది. మెరుగైన జాబ్స్ డేటాతో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలతో ముదపర్ల సెంటిమెంట్ను దెబ్బతీందని నిపుణులు అంటున్నారు. ఐటీ షేర్లను ఏఐ భయాలు వెంటాడంతో నష్టాల్లో ముగిశాయి. ఆంథ్రోపిక్ భయాలు, అమెరికా జాబ్స్ డేటా ఐటీ షేర్లపై ప్రభావం చూపింది.
ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోతే యూఎస్ కంపెనీలు కాస్ట్ కట్టింగ్ లో భాగంగా ఆర్డర్లు తగ్గించవచ్చు. దీంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ వంటి టాప్ ఐటీ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చూశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 5 శాతం మేర నష్టాలు ఎదుర్కొంది. బీఎస్ఈలో కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లు తగ్గింది.
గురువారం ఉదయం సెన్సెక్స్ 83,968.43 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఐటీ షేర్ల అమ్మకాలతో రోజంతా నష్టాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 83,516.67 వద్ద కనిష్ఠాన్ని తాకింది. సెన్సెక్స్ 558.72 పాయింట్ల నష్టంతో 83,674.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 146.65 పాయింట్ల నష్టంతో 25,807.20 వద్ద ముగిసింది.
డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.90.61 వద్ద ఉంది. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, ట్రెంట్, బీఈఎల్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 69 డాలర్ల వద్ద ఉంది. బంగారం ఔన్స్ 5064 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.
Also Read: వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఇవాళ్టి విశేషాలివే
“ఏఐ వల్ల పెరుగుతున్న ఆందోళనలు, యూఎస్ జాబ్స్ డేటా కారణంగా US ఫెడ్ రేటు కోత అంచనాలు తగ్గడంతో ఐటీ ఇండెక్స్లో పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీసింది” నిపుణులు అంటున్నారు. అందుకే దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయంటున్నారు.