Gas Booking New Rules: దేశంలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనలు మారాయి. ఇకపై ఒక సిలిండర్ డెలివరీ అయిన 21 రోజుల తర్వాతే మరో గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి వీలుంటుంది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో గ్యాస్ సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 21 రోజుల బుకింగ్ రూల్ అమలు చేస్తున్నాయి. అలాగే ఎల్పీజీ ధర కూడా పెరిగింది. 14.2kg ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.60 పెంచారు. దీంతో ఇప్పుడు గ్యాస్ ధర రూ.913 చేరింది. వినియోగదారులకు సమానంగా గ్యాస్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీవ్రం అవుతుండడంతో చమురు సరఫరా నిలిచిపోతుందనే భయం ప్రజల్లో నెలకొంది. ఈ ఆందోళనతో గ్యాస్ సిలిండర్లు బుకింగ్ పెరగడంతో గ్యాస్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. అక్రమ నిల్వలను అరికట్టేందుకు కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చాయి. ఇప్పుడు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం కనీసం 21 రోజులు పీరియడ్ పెట్టింది.
ఇటీవల పలు నగరాల్లో గ్యాస్ బుకింగ్ భారీగా పెరిగింది. రోజుకు వచ్చే ఆర్డర్ల కంటే 20 శాతం మేర పెరిగాయని ఏజెన్సీలు గుర్తించాయి. యుద్ధం వల్ల భవిష్యత్తులో గ్యాస్ కొరత పెరుగుతుందని భావిస్తున్న జనం, ముందస్తుగా సిలిండర్లను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చమురు సంస్థలు తెలిపాయి. అందుకే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి చమురు సంస్థలు 21 రోజుల నిబంధన అమలు చేస్తున్నాయి.
Also Read: సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు.. హైదరాబాద్లో కొత్త రేట్లు ఇవే!
ఈ రూల్ ప్రకారం రీఫిల్ బుక్ చేసిన తర్వాత 21 రోజుల లోపు మళ్లీ కొత్త సిలిండర్ బుక్ చేసే అవకాశం ఉండదు. ఈ లాక్-ఇన్ పీరియడ్ వల్ల అవసరం ఉన్న వారికే సిలిండర్లు అందుతాయి. పానిక్ బుకింగ్ కారణంగా చమురు సంస్థల బాట్లింగ్ ప్లాంట్లలో సమస్యలు తలెత్తుతున్నాయి. జనం ఖాళీ సిలిండర్లను ఇచ్చి కొత్తవి తీసుకునే బదులు, ఉన్న వాటిని స్టోర్ చేసుకుంటున్నారు. దీంతో రీఫిల్లింగ్ ప్లాంట్లకు తగినన్ని ఖాళీ సిలిండర్లు రావడం లేదు. ఫలితంగా బాట్లింగ్ ప్లాంట్ల సామర్థ్యం 20 శాతం వరకు తగ్గిపోయిందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి.