PM Modi On Gold: బంగారం.. ఈ పేరు చెప్పనక్కర్లేదు. మన దేశం-పుత్తడికున్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. పెళ్లిళ్లు, పండుగలు ఇలా ఏది చూసినా బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది బంగారం కొంటూనే ఉంటారు భారతీయులు. దేశవ్యాప్తంగా ఇళ్లలో భారీగా బంగారం ఉందని వివిధ నివేదికలు చెబుతున్నాయి.
ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో ప్రజలకు కీలక పిలుపు ఇచ్చారు. కొత్తగా బంగారం కొనుగోలు, దిగుమతి చేసుకునే బదులు ఇళ్లు, దేవాలయాల్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేయాలన్నారు.
దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచన చేశారు. దీనివల్ల బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. వివిధ సంస్థల నివేదికలు, గణాంకాలను పరిశీలిస్తే దేశంలో బంగారం పుష్కలంగా ఉందని తేలింది. పరిశ్రమ అంచనాల ప్రకారం.. భారతీయ గృహాలు-ఆలయాల వద్ద దాదాపుగా 30 నుంచి 32 వేల టన్నుల బంగారం ఉన్నట్లు చెబుతున్నాయి.
గృహాలు, దేవాలయాల్లో బంగారం 32 వేల టన్నులు
సుమారు 3.8 ట్రిలియన్ డాలర్ల విలువన్నమాట. అందులో అధిక భాగం లాకర్లు, అల్మారాలు, ఖజానాలలో ఉన్నాయి. పాత ఆభరణాలు, నాణేలు, ఇతర బంగారు వస్తువులను కరిగించి శుద్ధి చేస్తే 99.9 శాతం స్వచ్ఛమైన బంగారంగా మార్చవచ్చు. ఆ బంగారాన్ని తిరిగి కొత్త వస్తువుల తయారీకి ఉపయోగించడం వల్ల దిగుమతుల అవసరం తగ్గుతుందన్నది ప్రధాని మాట.
ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ ఉంది. దేశీయంగా ఉత్పత్తి తక్కువైనా, ప్రతీ ఏటా బిలియన్ల డాలర్లు వెచ్చించి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. 2025-26 ఆర్థిక లెక్కల ప్రకారం మన దేశం దాదాపు 72.4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది.
ALSO READ: ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్గా బాదుడు.. సిలిండర్కు రూ.42
ముడి చమురు తర్వాత దిగుమతి అధిక భాగం పుత్తడిదే. దిగుమతులకు చెల్లింపులు యూఎస్ డాలర్లలో చెల్లించడం వల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా రూపాయి పతనం, ఆపై కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోందని విశ్లేషకుల మాట. దేశంలో ఉన్న బంగారంలో కేవలం ఒక శాతం ఏటా రీసైక్లింగ్ చేసినా దిగుమతులు 25 నుంచి 30 శాతం వరకు తగ్గుతాయని వివిధ బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రీసైక్లింగ్ పద్దతి వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గుతుందని, ఫలితంగా వాణిజ్య లోటును కంట్రోల్ చేయవచ్చని అంటున్నాయి. ప్రధాని మోదీ పిలుపును జ్యువెలరీ అసోసియేషన్లు స్వాగతించాయి. పాత బంగారాన్ని మార్చుకునే వారికి తక్కువ తరుగుతో కొత్త డిజైన్లు చేసే కార్యక్రమాలు మొదలుపెట్టేశాయి.