petrol pumps Dealer: యూపీఐ చెల్లింపుల వ్యవహారంపై వ్యాపార వర్గాలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఎండీఆర్ పన్ను వ్యవహారం తొలుత పెట్రోల్ పంపులపై పడనుంది. దీన్ని గమనించిన పెట్రోల్ పంపుల డీలర్లు.. కేంద్రానికి ఓ లేఖ రాశారు. కొత్తగా తీసుకొచ్చిన ఛార్జీలను వెనక్కి తీసుకోకుండే యూపీఐ లావాదేవీలను అక్టోబర్ 15 నుంచి నిలిపివేస్తామంటూ లేఖ రావడం తీవ్ర కలకలం రేపింది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్-MDR వ్యవహారంపై వ్యాపారుల్లో గుబులు మొదలైంది. సామాన్యులు ఇచ్చే డబ్బులు తాము ఎందుకు ఛార్జీలు చెల్లించాలని అంటున్నారు. అంతేకాదు యూపీఐ లావాదేవీలపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల డీలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 15 నుండి దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులు నిలిపివేయాలని డిసైడ్ అయ్యింది. కేవలం ముంబై సిటీలోనే కాదని, దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల్లో రూ. 2000, అంతకంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులను నిలిపి వేస్తామని హెచ్చరించాయి.
కేంద్రం తీసుకొచ్చిన నిర్ణయం వల్ల అక్టోబర్ 15 నుండి రూ. 2000 దాటిన కొన్ని రకాల మర్చంట్ యూపీఐ లావాదేవీలపై రూ.5 చొప్పున ఫ్లాట్ MDR ఛార్జీలు వర్తించనున్నాయి. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై తమకు లీటరుకు కేవలం రూ. 2.40 నుండి రూ. 3.40 వరకు లాభం ఉంటుందని చెబుతున్నాయి. కొత్త ఛార్జీల వల్ల ఆ లాభాలు మరింత తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డీలర్లు. తమ అవుట్లెట్లలో 60 శాతానికి పైగా ఇంధన అమ్మకాలు డిజిటల్ చెల్లింపుల ద్వారా జరుగుతున్నాయని అసోసియేషన్ తెలిపింది. గతంలో ఉన్న జీరో ఎమ్డిఆర్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా తాము చెల్లింపుల కోసం మౌలిక సదుపాయాలలో భారీగా పెట్టుబడులు పెట్టామని తెలిపారు.
జీరో ఎమ్డిఆర్ హామీతో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రిటైల్ అవుట్లెట్లు అన్ని డీజిల్ అమ్మకాల లావాదేవీలలో 60 శాతానికి పైగా డిజిటలైజేషన్ను సాధించాయన్నారు. అనేక కీలకమైన పరిమితుల కారణంగా రిటైలర్లకు మనుగడ సంక్షోభాన్ని సృష్టిస్తోందని ముంబై పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చేతన్ మోడీ అన్నారు. పెరుగుతున్న నిర్వహణ, నిబంధనల పాటింపు ఖర్చులను డీలర్లు ఎత్తిచూపారు. దశాబ్ద కాలంగా తమ కమీషన్లు మారలేదని, ఇంధన ధరలు నియంత్రించడం, లావాదేవీల ఛార్జీలను వినియోగదారులకు బదిలీ చేయడం కష్టంగా ఉండటంతో ఈ అదనపు భారాన్ని రిటైలర్లే భరించాల్సి వస్తుందన్నారు.
ALSO READ: రెండుగా చీలిన టాటా గ్రూప్.. చంద్రశేఖరన్ ‘మళ్లీ ఓకే’.. నోయెల్ టాటా ‘నాట్ ఓకే’!
రూ. 2000 లోపు చేసే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని, ఆ తర్వాత జరిగే లావాదేవీలను నిలిపివేసి కేవలం నగదు (Cash-only) మాత్రమే తీసుకోవాలని చూస్తున్నారు డీలర్లు. నూతన ఛార్జీల నుండి ఇంధన రంగానికి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ముంబై పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక శాఖకు లేఖలు రాసింది. ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. అక్టోబర్ 15 నుండి వాహనదారులు పెద్ద మొత్తంలో ఆయిల్ కోసం వచ్చినప్పుడు నగదు తీసుకెళ్లాల్సి వుంటుంది.