Tata Sons Crisis: టాటా గ్రూపులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు నెల రోజుల క్రితం ప్రకటించిన ఎన్. చంద్రశేఖరన్ కు అనూహ్యంగా బోర్డు నుంచి మద్దతు లభించింది. మరో ఐదేళ్లపాటు ఆయనే ఛైర్మన్ గా కొనసాగాలని గురువారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో ఐదేళ్లు టాటా సన్స్ ఛైర్మన్ గా చంద్రశేఖరన్ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే టాటా గ్రూప్లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బోర్డు తీసుకున్న ఈ తీర్మానం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
గతంలో చేసిన రాజీనామా ప్రకటనను పునఃపరిశీలించుకోవాలని బోర్డు కోరడంతో చంద్రశేఖరన్ అందుకు అంగీకరించారు. ‘సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో బోర్డు విజ్ఞప్తి మేరకు చంద్ర తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయననే మరో ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పునర్నియమించేందుకు బోర్డు మెజారిటీ ఓటుతో తీర్మానించింది’ అని టాటా సన్స్ అధికారికంగా తెలిపింది.
వాస్తవానికి గతేడాది సెప్టెంబర్ లోనే చంద్ర శేఖరన్ ను మరో ఐదేళ్లు చైర్మన్గా కొనసాగించేందుకు బోర్డు సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారిక ఆమోదం తెలపాలని భావించింది. అయితే ఫిబ్రవరిలో బోర్డు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు. మే, జూన్ నెలల్లో జరిగిన బోర్డు సమావేశాల్లో కూడా ఈ అంశంపై స్పష్టత రాలేదు. దీంతో మనస్తాపం చెందిన చంద్ర శేఖరన్.. ఆగస్టు 12న తన ప్రస్తుత పదవీకాలం ముగిశాక కొనసాగకూడదని నిర్ణయించుకున్నారు.
చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3న టాటా సన్స్ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ (NRC) సమావేశమైంది. గ్రూప్ ప్రయోజనాలు, చంద్ర శేఖరన్ అందించిన సేవలను గుర్తించిన కమిటీ.. ఆయనను తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏకగ్రీవంగా కోరింది. తదుపరి బోర్డు సమావేశంలో ఆయన పునర్నియామకాన్ని సిఫార్సు చేయాలని నిర్ణయించింది. ఆ సిఫార్సుల ఆధారంగానే గురువారం నాటి సమావేశంలో బోర్డు చంద్ర శేఖరన్ వైపే మొగ్గు చూపింది.
Also Read: వినూత్న నిరసన.. అధికారి టేబుల్పై వీధి కుక్క.. 8 రోజుల డెడ్ లైన్!
అయితే టాటా సన్స్ బోర్డు నిర్ణయాన్ని ప్రధాన వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్ తీవ్రంగా తప్పుపట్టింది. టాటా ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్లలో ఒకరైన నోయెల్ టాటా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాబట్టి ఈ తీర్మానానికి చట్టబద్ధత లేదని టాటా ట్రస్ట్స్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 2027 ఫిబ్రవరి 20న పదవీకాలం ముగిశాక తప్పుకుంటానన్న చంద్రశేఖరన్ నిర్ణయాన్ని ఇప్పటికే ఆమోదించామని, అదే ఆఖరి నిర్ణయమని టాటా ట్రస్ట్స్ తేల్చిచెప్పింది. మెజారిటీ వాటాదారుగా తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని గురువారం నాటి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని నోయెల్ టాటా స్పష్టం చేశారని పేర్కొంది. దీంతో టాటా సన్స్ బోర్డుకు, టాటా ట్రస్ట్స్కు మధ్య విభేదాలు మరింత ముదిరినట్లయింది.
Also Read: రోజుకు 3GB డేటా కావాలా? Airtelలో ఈ రెండే బెస్ట్ ప్లాన్స్.. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సైతం ఉచితం!