Trump: ఇరాన్పై యుద్ధం విషయంలో అమెరికా వెనుకడుగు వేసిందా? అమెరికా వెనుకడుగు వేసినా తాము వెనక్కి తగ్గమని ఇజ్రాయెల్ ఎందుకు చెప్పింది? మరో ఐదు రోజులు వెయిట్ చేస్తామని ట్రంప్ ఎందుకన్నారు? ట్రంప్ ప్రకటన ముందు ఆ దేశ స్టాక్స్ ఎలా పెరిగాయి? నిజంగానే మార్కెట్లో ఇన్సైడ్ ట్రేడ్ జరిగిందా?
ట్రంప్ ప్రకటన వెనుక ఏం జరిగింది?
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వాల్స్ట్రీట్లో పెను దుమారం రేపుతోంది. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందే ఆదేశ స్టాక్ మార్కెట్లో భారీగా లావాదేవీలు జరిగినట్టు ఆ దేశ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి.
ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనే అనుమానాలు ఊపందుకున్నాయి. అత్యంత రహస్యంగా ఉండాల్సిన సమాచారం, లీక్ కావడం వల్ల కొందరు పెట్టుబడిదారులు వందల కోట్ల లాభాలు గడించారని ఆరోపణలు గుప్పుమన్నాయి. ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించక ముందు ఆదేశ స్టాక్ మార్కెట్లో ఎస్ & పీ 500 ఫ్యూచర్స్లో కొందరు ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రకటనకు ముందే స్టాక్స్ కొనుగోళ్లు? ఇన్సైడ్ ట్రేడింగ్ నిజమా?
ట్రంప్ ప్రకటన చేయగానే మార్కెట్ ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లింది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన అనుమానాస్పద ట్రేడింగ్ జరిగినట్లు రాసుకొచ్చాయి. కొన్ని మిడియా కథనాల ప్రకారం.. న్యూయార్క్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6.49 నుండి 6.50 గంటల మధ్య ఈ తతంగం జరిగింది. పావుగంట తర్వాత అంటే 7.05 గంటలకు ట్రంప్ ఇరాన్ గురించి మార్కెట్ను ప్రభావితం చేసే ఓ పోస్ట్ చేశారు.
వ్యాపారులు బ్రెంట్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్లో సుమారు 580 మిలియన్ డాలర్ల విలువైన పందాలు వేసినట్టు తెలుస్తోంది. దాదాపు 6,200 కాంట్రాక్టులకు సంబంధించిన ఈ లావాదేవీలు, ట్రంప్ ప్రకటనకు సుమారు 15 నిమిషాల ముందు జరిగాయి. అదే సమయంలో ట్రేడింగ్ వాల్యూమ్ పెరిగాయని, S & P 500 ఫ్యూచర్స్ పెరగడం ప్రారంభించిందని పేర్కొన్నాయి.
ALSO READ: మార్కెట్లో బంగారం-సిల్వర్ పతనం తప్పదు? ఎప్పటివరకు అంటే?
ఆర్థిక కారణాలు లేకుండా తక్కువ సమయంలో ఈ స్థాయిలో లావాదేవీలు జరగడం అసాధారణమైనవని మార్కెట్ భాగస్వాములు అంటున్నారు. చమురు మార్కెట్లలో ఇలాంటి ఒరవడి కనిపించింది. అత్యంత కీలక సమాచారం వైట్హౌస్ లేకుంటే రక్షణ శాఖ నుంచి బయటకు వచ్చిందనే వాదనలు లేకపోలేదు. యుద్ధం వంటి అంశాన్ని అడ్డం పెట్టుకుని కొందరు అక్రమంగా లాభాలు పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. దీనిపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.