TRAI Deadline: ఫోన్ ద్వారా ఆర్థిక మోసాలు పాల్పడేవారిపై ఫోకస్ చేసింది ట్రాయ్. జనవరి ఒకటి నుంచి ఆ తరహా మోసాలకు చెక్ పడనుంది. అందుకోసం టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నడుం బిగించింది. జనవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు చేయాలని వివిధ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ఇంతకీ అసలు మేటరేంటి?
జనవరి ఒకటి నుంచి ఆర్థిక మోసాలను చెక్
భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా , పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నియంత్రణలో ఉన్న సంస్థలు ఇకపై 1600 నెంబర్ సిరీస్తో ఫోన్ నెంబర్లను ఉపయోగించనున్నాయి. ఆ సిరీస్ నెంబర్ తో వినియోగదారులకు ఫోన్లు చేయనున్నాయి. 2026 జనవరి ఒకటి నుంచి బ్యాంకులు తమ వినియోగదారులకు చేసే ఫోన్కాల్స్ ఈ సిరీస్ నెంబరు నుంచే రావాలని నిర్దేశించింది.
దేశంలోని అందరి చేతుల్లో మొబైల్ ఫోన్ రావడంతో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. తాము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఖాతాదారులను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ వివరాలు తీసుకుని వినియోగదారుల ఖాతా నుంచి నగదు ఖాళీ చేస్తున్నారు. ఇంకొందరు డిజిటల్ అరెస్టు పేరుతో చాలామంది మోసపోతున్నారు. వీటికి పూర్తి స్థాయిలో చెక్ పడనుంది. టెలికాం నియంత్రణ సంస్థ-ట్రాయ్ రంగంలోకి దిగేసింది.
1600 సిరీస్తో ఫోన్ కాల్స్ మొదలు
2026 జనవరి 1 నుంచి బ్యాంకులు తమ వినియోగదారులకు చేసే ఫోన్కాల్స్ 1600 సిరీస్ నెంబర్ నుంచే రావాలని ఆదేశాలు ఇచ్చింది. కేవలం బ్యాకింగ్ మాత్రమే కాదు ఫైనాన్స్ లావాదేవీల సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇకపై 1600 సిరీస్ నెంబర్ని వినియోగించనున్నాయి. ఈ నెంబర్ సిరీస్ సేవలు అమలు చేసేందుకు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 15 వరకు దశల వారీగా గడువు ఇచ్చింది ట్రాయ్.
ఇలాంటి పద్దతి వల్ల వినియోగదారుల విశ్వాసం పెరుగుతుందని అంచనా వేస్తోంది. అంతేకాదు స్పామ్ కాల్స్ చెక్ పడనుంది. వాయిస్ కాల్స్ ద్వారా జరిగే మోసపూరిత కార్యకలాపాలు తగ్గే అవకాశముంది. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి 1600 సిరీస్ ఫోన్ నంబర్లను ఉపయోగించునున్నాయి.
ALSO READ: భారీగా షాకిచ్చిన బంగారం ధరలు
మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు సైతం వీటిని అమలు చేయనున్నాయి. క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లకు వచ్చే ఏడాది మార్చి 15 వరకు గడువు ఇచ్చింది. ఇక సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు, పెన్షన్ ఫండ్ మేనేజర్లు 2026 ఫిబ్రవరి 15 వరకు గడువు ఇచ్చింది. బీమా రంగంలోని సంస్థలు ఈ సిరీస్ను అమలు చేసేందుకు ఐఆర్డీఏఐతో చర్చిస్తుంది. దానికి సంబంధించి రేపో మాపో ప్రకటన చేస్తామని తెలిపింది ట్రాయ్.