దేశ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో తెలంగాణకు భారీ ప్రాజెక్టులను కేటాయించారు. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న హైస్పీడ్ ట్రైన్ కారిడార్ల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేస్తూ, దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన 7 కారిడార్లలో ఏకంగా మూడు హైదరాబాద్ కేంద్రంగా ఉండటం విశేషం.
హైదరాబాద్ నుంచి దక్షిణ, పశ్చిమ భారత దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ మూడు హైస్పీడ్ మెట్రో ట్రైన్ కారిడార్లను కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్ – పుణె
హైదరాబాద్ – బెంగళూరు
హైదరాబాద్ – చెన్నై
ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే గంటల కొద్దీ సాగే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ముఖ్యంగా ఐటీ నిపుణులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది వరంలా మారనుంది. రవాణా వ్యవస్థ వేగవంతం కావడంతో పాటు, ఈ మార్గాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభించనుంది. హైదరాబాద్ ఒక ప్రధాన ఆర్థిక హబ్గా ఎదగడానికి ఈ కారిడార్లు దోహదపడతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇవే కాకుండా ముంబై-పుణె, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాశి, వారణాశి-సిలిగుడి మధ్య కూడా హైస్పీడ్ కారిడార్లను ప్రభుత్వం ప్రకటించింది.
నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ఈ ఏడాది బడ్జెట్ ప్రధానంగా యువశక్తిని ఉద్దేశించి రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. భారత నైపుణ్యాన్ని, ఉత్పాదకతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి రేటుతో స్థిరంగా కొనసాగుతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో సుమారు 350 నూతన సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ (MSME) రంగానికి పెద్దపీట వేస్తూ ఆర్థిక చేయూతను అందించనున్నారు. మౌలిక వసతుల కల్పన, నగరాల అభివృద్ధి కోసం ప్రత్యేక ‘ఆర్థిక జోన్ల’ ఏర్పాటు వంటి నిర్ణయాలు పారిశ్రామిక వృద్ధికి బాటలు వేయనున్నాయి. ప్రపంచ మార్కెట్లతో భారత్ను అనుసంధానిస్తూనే, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
పేదలు, దళితులు, ఆదివాసీలు మరియు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. దీర్ఘకాలిక భద్రతతో పాటు ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా వెచ్చిస్తూనే, సామాజికాభివృద్ధికి పెద్దపీట వేయడం ఈ బడ్జెట్ ప్రత్యేకత.
ALSO READ: Union Budget 2026: ఏపీ మైనింగ్పై కేంద్రం వరాల జల్లు.. నిర్మలమ్మ నోట పసందైన ప్రకటన!