Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డులకెక్కారు. ఈ బడ్జెట్ లో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి తయారీ, మౌలిక సదుపాయాల రంగాల వృద్ధికి అనేక పథకాలను ప్రతిపాదించారు. కేంద్ర బడ్జెట్ 2026 ప్రకారం రూపాయి ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళుతుందో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం.. పన్నులు, రుణాలు, ఎక్సైజ్ డ్యూటీల వస్తుంది. 2026-27 బడ్జెట్ ప్రకారం రూపాయిలో ఎక్కువ వాటా రుణాలు, ఇతర అప్పుల నుంచి వస్తుంది. ఇది మొత్తంలో 24 శాతం ఉంది. ప్రభుత్వం తన ఖర్చులకు నిధులు సమకూర్చుకోవడానికి మార్కెట్ రుణాలు, ఇతర లోన్లపై ఆధారపడుతుంది. ఆదాయపు పన్ను వాటా 21 శాతంగా ఉంది. ఇందులో సెక్యూరిటీ లావాదేవీల పన్నులు, వసూల్లు కూడా ఉంటాయి. కంపెనీలు తమ లాభాలపై చెల్లించే కార్పొరేషన్ ట్యాక్స్ 18 శాతంగా ఉంది. జీఎస్టీ, ఇతర పన్నులు కలిపి రూపాయిలో 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డెవిడెండ్లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, లైసెన్స్ ఫీజులు, సర్వీస్ ఛార్జీలు కలిపి 10 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
పెట్రోలియం ప్రొడెక్ట్స్ పై వసూలు చేసి ఎక్సైజ్ సుంకాలు 6 శాతం ఉన్నాయి. ఎగుమతులు, దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు 4 శాతం, రుణాల రికవరీ, పెట్టుబడుల ఉపసంహరణ, రుణాల రికవరీ 2 శాతం ఉంటాయి.
Also Read: Union Budget 2026: నిర్మల బడ్జెట్-2026 ప్రసంగం.. రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్, ఏపీకి..
కేంద్ర బడ్జెట్ లో ఎక్కువ శాతం రాష్ట్రాలకు బదిలీ చేస్తుంది. రూపాయిలో ఎక్కువ భాగం 22 శాతం ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాగా కేటాయిస్తారు. వడ్డీల చెల్లింపులకు 20 శాతం, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 17 శాతం, రక్షణ రంగానికి 11 శాతం కేటాయిస్తారు. జాతీయ భద్రత కోసం, అవసరమైన పరికరాల కొనుగోలుకు రక్షణ నిధులు ఉపయోగించనున్నారు.
కేంద్ర, రాష్ట్ర సంయుక్త పథకాలకు 8 శాతం వాటా నిధులు కేటాయిస్తారు. ఆర్థిక కమిషన్ గ్రాంట్లు, ఇతర బదిలీలు మరో 7 శాతంగా ఉన్నాయి. ఆహారం, ఎరువులు వంటి అంశాలపై ప్రధాన సబ్సిడీలు 6 శాతం ఉన్నాయి. పరిపాలనా, ఇతర ఖర్చులు 7 శాతం వాటా ఉన్నాయి. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు 2 శాతం కలిగి ఉంటాయి.