Central Govt Employees Salary Hike| కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ పే కమిషన్ (కేంద్ర వేతన సంఘం) పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కొత్త వేతనాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయనే విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా వేతన సంఘం పనుల పురోగతిపై కీలక సమాచారం వెల్లడించింది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలతో చర్చలు కొనసాగుతున్నాయని, వాటి ఆధారంగా తుది నివేదిక సిద్ధం చేస్తామని తెలిపింది.
ఇటీవల రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 8వ వేతన సంఘం పనులపై వివరాలు వెల్లడించింది. వేతన సంఘం తన తుది నివేదికను 18 నెలల్లో సమర్పించే అవకాశం ఉందని తెలిపింది. 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ లెక్కన చూస్తే 2027 మే నెల నాటికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
వేతన సంఘం నివేదిక సమర్పించిన వెంటనే కొత్త వేతనాలు అమల్లోకి రావని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను పూర్తిగా పరిశీలిస్తుంది. అవసరమైతే కొన్ని సిఫార్సులను సవరిస్తుంది లేదా మార్పులు చేస్తుంది. ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన తర్వాత మాత్రమే కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి. అందువల్ల ఉద్యోగులు 2027 మే తర్వాత కూడా కొంతకాలం వేచి చూడాల్సి రావచ్చు.
8వ వేతన సంఘం పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది. సంఘం తన విధివిధానాల ప్రకారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ సిఫార్సులు సిద్ధం చేస్తోంది. అందువల్ల వేతన సంఘం ప్రతి సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కారణంగా ఇప్పటివరకు ఎవరెవరితో సమావేశాలు జరిగాయనే పూర్తి సమాచారం తమ వద్ద లేదని ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం వేతన సంఘం దేశంలోని వివిధ ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో ఆగస్టు 7, ఆగస్టు 10 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించనుంది.
ఇప్పటికే తమ డిమాండ్లను మెమోరాండంగా సమర్పించిన సంఘాలు నిర్ణయించిన గడువులోపు సమావేశాల కోసం అపాయింట్మెంట్ కోరవచ్చు.
తదుపరి సమావేశాలు దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా జరుగనున్నాయి. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో చెన్నైలో, సెప్టెంబర్ 9న పుదుచ్చేరిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ ప్రాంతాలకు చెందిన సంఘాలు ఆగస్టు 18లోపు తమ సమావేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించనున్నారు.
ఉద్యోగ సంఘాలు పలు ముఖ్యమైన అంశాలను వేతన సంఘంతో చర్చిస్తున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్, కనీస ప్రాథమిక వేతనం, పెన్షన్, డియర్నెస్ అలవెన్స్ (డీఏ), హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ), ఇతర ఉద్యోగ ప్రయోజనాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నాయి. ఈ సమావేశాల ద్వారా ఉద్యోగుల అవసరాలు, అంచనాలను వేతన సంఘం తెలుసుకుంటోంది.
Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తొలిసారి తీసుకుంటున్నారా? ముందు ఈ 4 విషయాలు తప్పక చెక్ చేయండి
ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. కొత్త బేసిక్ పే ఎంత ఉంటుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించలేదు.
పెన్షన్లు, ఇతర అలవెన్సులపై కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సిఫార్సులు విడుదల కాలేదు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వేతనాల వివరాలు అధికారికమైనవి కావని గుర్తుంచుకోవాలి.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు
8వ కేంద్ర వేతన సంఘం పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు నిర్వహించి తుది నివేదికను సిద్ధం చేస్తున్నారు. అయితే పెరిగిన వేతనాలు వెంటనే అమల్లోకి రావు. ప్రభుత్వ ఆమోదం అనంతరం మాత్రమే వేతన సవరణలు అమలవుతాయి. అందువల్ల ఉద్యోగులు అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండటం ఉత్తమం.
Also Read: UPSC Jobs: యుపిఎస్సి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్.. రూ.2 లక్షలకు పైగా జీతం