Weather Alert: ఛత్తీస్గఢ్ దానిని ఆనుకున్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమైంది. దీనికారణంగా ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనికితోడు రుతుపవన ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
బలహీనపడిన వాయుగుండం-అల్పపీడనం ప్రభావం తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం తెలంగాణలో సాధారణ వర్షాలు కురుస్తాయి. గడిచిన రెండురోజులుగా కుమ్మేసిన వర్షాలు ఇవాళ కాస్త శాంతివచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా తూర్పు, ఉత్తర, పశ్చిమ తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మధ్యాహ్నం నుంచి కుమ్ముడే కుమ్ముడు-మధ్యాహ్నం వరకు వాతావరణం నార్మల్గా ఉన్నా, ఆ తర్వాత వర్షం పడే అవకాశముందని అంచనా వేశారు. ఉత్తర తెలంగాణలో గడిచిన మూడు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక హైదరాబాద్లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఆ తర్వాత రాత్రి వరకు పలు చోట్ల చెదురుమదురు వర్షం పడే అవకాశం ఉంది.
ఇక ఏపీ విషయానికి వద్దాం. రాగల మూడు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీ వ్యాప్తంగా వాతావరణంలో గణనీయ మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలిపింది. వర్షాలు పడే సమయంలో పిడుగులు కూడా పడతాయని పేర్కొంది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
ALSO READ: బోర్డర్ చెకింగ్ పేరిట వసూళ్లు.. లారీ డ్రైవర్ స్టింగ్ ఆపరేషన్, కామారెడ్డిలో వెలుగులోకి వ్యవహారం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గాలులు వీచే సమయంలో బయట ఉండకూడదని సూచించింది. చెట్లు, హోర్డింగ్స్, పాత భవనాలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.