US Panel On India Oil Imports: భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కొలిక్కి వస్తున్నట్లు గత వారం ఇరుదేశాలు ప్రకటించాయి. అలాగే భారత్ పై 25 శాతం అదనపు సుంకాలు రద్దు చేస్తున్నట్లు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా పేర్కొంది. తాజాగా అమెరికా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ రష్యా చమురు దిగుమతిపై అమెరికా ప్యానెల్ పర్యవేక్షిస్తుందని పేర్కొంది. రష్యా చమురు కొనుగోళ్లు తిరిగి ప్రారంభమైతే భారత్ పై మళ్లీ సుంకాలు విధిస్తామని అమెరికా స్పష్టం చేసింది.
రష్యా ఆయిల్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతి చేసుకోమని భారత్ ప్రకటించిందని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తెలిపారు. భారత్ ఈ హామీకి కట్టుబడి ఉంటుందన్నారు. అలాగే అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందన్నారు.
“వాణిజ్య కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శి, ట్రెజరీ కార్యదర్శి, మరో సీనియర్ అధికారి ప్యానెల్.. భారత్, రష్యన్ ఫెడరేషన్ చమురును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతి చేసుకోవడం వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది” అని ట్రంప్ తాజా ఆర్డర్ లో పేర్కొన్నారు.
ఇండియా రష్యా ఆయిల్ ను కొనుగోలు చేసినట్లు ప్యానెల్ గుర్తిస్తే.. తాను భారత్ పై అదనపు చర్యలు తీసుకునేందుకు సిఫార్సులు చేస్తారని ట్రంప్ తెలిపారు. భారతదేశ వస్తువుల దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాన్ని తిరిగి విధించాలా? వద్దా? అని కూడా సిఫార్సు చేస్తారని ట్రంప్ ఆర్డర్ పేర్కొంది. ఈ ప్యానెల్ పై కేంద్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Also Read: రష్యా చమురు కొంటే అంతే.. భారత్ పై 500 శాతం సుంకాలు.. ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
2023-24 నుంచి రష్యా భారతదేశానికి అతిపెద్ద క్రూడ్ ఆయిల్ ఎక్స్ పోర్టర్ గా ఉంది. ఇతర ఎగుమతిదారులతో పోలిస్తే రష్యా నుంచి ఆయిల్ చీప్ గా లభిస్తుంది. 2025-26 నాటికి భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 35% ఉంది. రష్యాకు చెందిన రోస్నెఫ్ట్, లుకోయిల్లపై అధిక సుంకాలు, అమెరికా ఆంక్షల తర్వాత గత కొన్ని నెలలుగా చమురు దిగుమతులు తగ్గినప్పటికీ, భారత చమురు శుద్ధి కర్మాగారాలకు రష్యా ఇప్పటికీ అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా ఉంది. జనవరిలో రష్యా రోజుకు 1.16 మిలియన్ బ్యారెళ్ల చమురును ఇండియాకు సరఫరా చేసింది.