Bapatla Crime: బాపట్ల జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దరివాడ కొత్తపాలెం గ్రామంలో జరిగింది.
దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన ఓ బాలుడు నిన్న సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. చీకటి పడుతున్నా బాలుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. సమయం గడుస్తున్న కొద్దీ బాలుడి ఆచూకీ లభించకపోవడంతో గ్రామస్తుల సహాయంతో రాత్రంతా వెతికారు. పొలాలు, ఖాళీ ప్రదేశాలు ఇలా అన్నిచోట్లా గాలించినా ఫలితం లేకపోయింది.
చివరికి ఈరోజు తెల్లవారుజామున గ్రామ సమీపంలోని ఓ బావిలో బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ బావిలో పడిపోవడం వల్లే బాలుడు మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. అప్పటివరకు తమ కళ్లముందే తిరుగుతూ సందడి చేసిన చిన్నారి, ఇలా విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనతో దరివాడ కొత్తపాలెం గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. అభం శుభం తెలియని చిన్నారి మృతి పట్ల గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: సిగరెట్ లైటర్ కోసం గొడవ.. ప్రాణ స్నేహితుడే కాలయముడయ్యాడు.. ఇంత ఘోరమా!