Karnataka crime: కర్ణాటకలోని కమ్మసంద్ర గ్రామంలో కేవలం ఒక సిగరెట్ లైటర్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఒక ప్రాణాన్ని బలిగొన్న తీరు అత్యంత దిగ్భ్రాంతికరం. స్నేహితుల మధ్య మొదలైన మామూలు గొడవ, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసి హత్యకు దారితీసింది.
కమ్మసంద్ర గ్రామంలో స్థానికంగా నిర్వహించిన క్రికెట్ పోటీల సందర్భంగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్లను చూసేందుకు ప్రశాంత్ (35), రోషన్ హెగ్డే అనే ఇద్దరు స్నేహితులు అక్కడికి వెళ్లారు. ఆట ముగిసిన తర్వాత.. ఇద్దరూ కలిసి ఒకచోట మద్యం సేవించారు. ఆ సమయంలో సిగరెట్ లైటర్ విషయంలో వారిద్దరి మధ్య మాట మాట పెరిగి తీవ్ర గొడవకు దారితీసింది. కోపంతో ఊగిపోయిన ఇద్దరూ బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ పెనుగులాటలో రోషన్ నాలుకకు తీవ్ర గాయమైంది.
గొడవ తీవ్రం కావడంతో రోషన్ అక్కడి నుండి తన కారులో పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే.. ప్రశాంత్ అతడిని వదలకుండా కారు డోరు పట్టుకుని అడ్డగించేందుకు ప్రయత్నించాడు. ఆవేశంతో ఉన్న రోషన్, ప్రశాంత్ కారును పట్టుకుని ఉన్నాడన్న స్పృహ లేకుండా వేగంగా కారును పోనిచ్చి ఒక చెట్టుకు బలంగా ఢీకొట్టాడు. కారుకు, చెట్టుకు మధ్య నలిగిపోయిన ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే ప్రశాంత్ ప్రాణాలు విడిచాడు.
ఈ భయంకరమైన దృశ్యాలన్నీ నిందితుడి కారులోని డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిందితుడు రోషన్ కూడా నాలుక తెగిపోవడంతో పాటు ఇతర గాయాలతో ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పోలీసుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: రాయలసీమను పట్టించుకునే వారే లేరా..
సిగరెట్ లైటర్ కోసం గొడవ.. ప్రాణ స్నేహితుడే కాలయముడయ్యాడు.. ఇంత ఘోరమా!#cigarettelighter #Kammasandra #Karnataka #CarAccident #Swetchadaily pic.twitter.com/Oc64iIFQof
— Swetcha Daily News (@SwetchaNews) January 27, 2026