Bengaluru Airport: బెంగళూరు ఎయిర్పోర్టులో దారుణమైన ఘటన జరిగింది. తనిఖీ పేరుతో దక్షిణ కొరియా మహిళపై సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు దిగాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అసలు కెంపెగౌడ ఎయిర్ పోర్టులో ఏం జరిగింది?
బెంగుళూరు ఎయిర్పోర్టులో దారుణం
బెంగుళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దారుణం జరిగింది. జనవరి 19న అంటే సోమవారం సౌత్కొరియాకు చెందిన మహిళా టూరిస్టు స్వదేశానికి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చింది. ఇమిగ్రేషన్ తనిఖీ తర్వాత టెర్మినల్ వైపు ఆమె వెళ్తుండగా గ్రౌండ్ సిబ్బంది మొహమ్మద్ అఫాన్ అనే వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు.
టికెట్ ప్లీజ్ అంటూ ఆమెని ఆపాడు. చెక్-ఇన్ లగేజీ నుంచి శబ్దం వస్తుందని అన్నాడు. రెగ్యులర్గా స్క్రీనింగ్ కౌంటర్ వరకు వెళ్లి తనిఖీలు చేయడానికి ఆలస్యం అవుతుందని ఆ మహిళతో చెప్పాడు. వ్యక్తిగతంగా తనిఖీ చేయాలంటూ ఆమెని వాష్రూమ్ సమీపంలోకి తీసుకెళ్లాడు. ఆమె అభ్యంతరం చెప్పినప్పటికీ అనుచితంగా పలు ప్రాంతాల్లో తాకాడు.
కొరియా మహిళను వేధించిన గ్రౌండ్ సిబ్బంది, ఆపై అరెస్టు
టూరిస్టు తీవ్రంగా ప్రతిఘటించింది. ఆమెని కౌగిలించుకుని ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎయిర్ పోర్టు సిబ్బందికి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎయిర్పోర్టు పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. మహిళ ఫిర్యాదుపై విమానాశ్రయంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్పోర్టులో గ్రౌండ్-కార్గో సేవలను అందించే ఎయిరిండియా SATS విభాగంలో అఫాన్ పని చేస్తున్నాడు. ఈ ఘటనను క్షమించరానిదిగా వర్ణించిన ఎయిర్ ఇండియా SATS, అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ సంఘటన వల్ల కలిగిన మానసిక క్షోభకు తాము తీవ్రంగా చింతిస్తున్నామని, అతిథికి అవసరమైన అన్ని సహాయాలను అందించామని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.
ALSO READ: నంద్యాల ట్రావెల్ బస్సు ప్రమాదం.. సీసీటీవీ ఫుటేజ్లో కీలక విషయాలు
భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. AISATS విభాగం.. అధికారులతో పూర్తిగా సహకరిస్తోంది, అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉందని ఓ ప్రకటనలో తెలిపింది.