Telangana: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగుచూసింది. అనారోగ్యంతో మరణించిన ఐ. శాంతమ్మ (70) అనే వృద్ధురాలి అంత్యక్రియలు ఆస్తి వివాదం కారణంగా రెండు రోజుల పాటు నిలిచిపోయాయి. సంతానం లేని ఆ వృద్ధ దంపతులకు బంధువుల మధ్య ఉన్న భూతగాదాలే ఈ దుస్థితికి కారణమయ్యాయి.
అయితే గ్రామస్థుల సమాచారం ప్రకారం, శాంతమ్మ భర్త అక్కలయ్య సోదరుని కుమారుడు జానయ్య గతంలో ఈ దంపతులకు సేవలు చేసేవాడు. అయితే జానయ్య ఇటీవల మరణించగా, శాంతమ్మ పేరిట ఉన్న ఐదున్నర ఎకరాల భూమి అప్పటికే మరో బంధువు పేరున పట్టా అయి ఉంది. వృద్ధురాలికి సేవ చేసిన తమకే ఆ ఆస్తి దక్కాలని జానయ్య కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో వివాదం మొదలైంది.
దీంతో ఆస్తి పంపకాలపై స్పష్టత వచ్చే వరకు అంత్యక్రియలు జరగనివ్వమని దాయాదులు భీష్మించుకోవడంతో మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. రెండు కుటుంబాల మధ్య చర్చలు విఫలం కావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో శాంతమ్మ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరపాలని జానయ్య కుమారుడు ఉమేశ్ పోలీసులను ఆశ్రయించాడు.
Also Read: సీఎం చంద్రబాబు భారీ ఊరట.. స్కిల్ స్కాం కేసును క్లోజ్ చేసిన ఏసీబీ కోర్టు
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనిషి ప్రాణం పోయినా కనికరం లేకుండా ఆస్తి కోసం పాకులాడుతూ అంత్యక్రియలు అడ్డుకోవడంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.