Skill Development Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై నమోదైన సంచలన ‘స్కిల్ డెవలప్మెంట్ కేసు’కు ఎట్టకేలకు తెరపడింది. ఈ కేసులో విచారణను ముగిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం (జనవరి 12, 2026) కీలక తీర్పు వెలువరించింది.
పూర్తి సమాచారం..
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నిధుల దుర్వినియోగం ఆరోపణలపై నమోదైన కేసును విజయవాడ ఏసీబీ కోర్టు అధికారికంగా మూసివేసింది. ఈ కేసులో ఎలాంటి నేర పూరిత ఆధారాలు లేవని పేర్కొంటూ సీఐడీ (CID) దాఖలు చేసిన తుది నివేదికను (Final Report) న్యాయస్థానం ఆమోదించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 37 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసును కొట్టివేసింది.
అంతేకాకుండా ఈ కేసులో సీఐడీ సమర్పించిన నివేదికను విశ్లేషించిన న్యాయస్థానం, దీనిని ‘మిస్టేక్ ఆఫ్ ఫాక్ట్’ (Mistake of Fact) గా అభివర్ణించింది. అంటే, ప్రాథమికంగా ఈ కేసు నమోదులో వాస్తవాలను తప్పుగా అంచనా వేయడం లేదా నేరం జరిగిందనడానికి తగిన సాక్ష్యాధారాలు లేకపోవడమే దీని అర్థం. ప్రాజెక్టులో ఎటువంటి నిధుల మళ్లింపు జరగలేదని, సీమెన్స్ సంస్థ నుంచి శిక్షణ కార్యక్రమాలు అందినట్లు కోర్టు సంతృప్తి చెందింది.
అలాగే తీర్పు వెలువరించడానికి ముందు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె. అజయ్ రెడ్డి ఈ కేసులో తన వాదనలను వినాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సీఐడీ సమర్పించిన క్లోజర్ రిపోర్ట్పై అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు ఆయనకు లేదని, సంస్థ కార్యకలాపాలు కేవలం ఎండీ (Managing Director) పరిధిలోకి వస్తాయని పేర్కొంటూ ఏసీబీ కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు 371 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని సీఐడీ అప్పట్లో కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా 2023, సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఇది దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనంగా మారింది.
Also Read: మద్యం మత్తులో లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్లోనే ఇద్దరు..
అరెస్ట్ అనంతరం చంద్రబాబు నాయుడు దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 2023 అక్టోబర్ 31న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. తాజాగా ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో న్యాయపరమైన ఊరట లభించినట్లయింది. స్కిల్ స్కామ్ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని టీడీపీ శ్రేణులు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబుపై నమోదైన స్కిల్ స్కాం కేసును క్లోజ్ చేసిన ఏసీబీ కోర్టు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తుది నివేదిక దాఖలు చేసిన సీఐడీ
స్కాం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో పేర్కొన్న సీఐడీ
సీఐడీ నివేదికతో అంగీకరించిన ఏసీబీ న్యాయస్థానం
మిస్టేక్ ఆఫ్ ఫాక్ట్ గా భావిస్తూ… pic.twitter.com/JKuVUaaHBZ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 13, 2026