Police Seized Gudumba : ఓవైపు మాదకద్రవ్యాల మత్తు నుంచి యువతను దూరం చేసే ప్రయత్నాల్లో పోలీసులు తలమునకలై ఉంటే.. కొందరు గుట్టుగా నాటుసారాకు తయారు చేస్తున్నారు. ప్రమాదకర రీతుల్లో సారాను ఉత్పత్తి చేస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులపై ఉక్కుపాదం మొపుతున్నారు.. తెలంగాణ ఆబ్కారీ శాఖ అధికారులు. తాజాగా.. 7 క్వింటాలకు పైగా సారాయి బెల్లాన్ని స్వాధీనం చేసుకుని, నాటుసారా తయారు చేస్తున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాటు సారా, ఇతర మాదక ద్రవ్యాల విషయంలో సీరియస్ గా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి ముడిసరకును సమకూర్చుకుంటున్నారు. అలా.. కర్ణాటక నుంచి నాటు బెల్లాన్ని దిగుమతి చేసుకుని హైదరాబాద్ లోని పహాడి షరీప్ ప్రాంతంలో నిల్వ చేస్తున్నారు. ఇక్కడే.. నాటు సారాను తయారు చేస్తూ వేల లీటర్లను జిల్లాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం.. డీసీఎం, ఆటోలను వినియోగిస్తుండగా.. వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్రమ సారాయి తయారీ ముఠాను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ బృందాలు పట్టుకున్నాయి.
ఎవరికీ అనుమానం రాకుండా పహడీ షరీఫ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నాటుసారాయి బెల్లాన్ని నిల్వ చేస్తుండగా.. పక్కా సమాచారం అందుకున్న తెలంగాణ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు దాడులు చేశారు. రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ సీఐలు బాలరాజ్, చంద్రశేఖర్ ఇతర సిబ్బంది కలిసి నాటుసారాయి బెల్లాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఒక డీసీఎం, రెండు ఆటోలను గుర్తించారు. వీటిలో భారీగా బెల్లం నిల్వలు ఉండగా.. ఈ ముడి సరకును దేవరకొండలోని నేరుడుగూడకు తరలించేందుకు సిద్ధం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బెల్లం, డీసీఎం,రెండు ఆటోలతో పాటుగా రూ.1.07 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా.. ఈ సోదాల్లో రూ. 15.90 లక్షల విలువైన సొమ్ముల్ని జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డీసీఎంలో 5,520 కేజీల బెల్లం ఉండగా, రెండు ఆటోల్లో కలిపి 2,340 కిలోల బెల్లం, మరో 40 కేజీల అలం ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సరూర్ నర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పక్కా సమాచారం మేరకు దాడులు చేసిన ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు పెద్ద ఎత్తున నాటుసారాయి తయారీ సరకును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు అరెస్ట్ కావడంతో.. ఈ సారాయి మొత్తం వ్యవహారాన్ని బయటకు తీయనున్నారు. అసలు బెల్లం ఎక్కడి నుంచి వస్తుంది. ఏఏ మార్గాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అనే సమాచారంతో పాటు ఎవరికి విక్రయిస్తున్నారనే సమాచారాన్ని రాబట్టనున్నారు. వీరి ద్వారా అందే సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో నాటుసారాయి తయారీదారుల వివరాలు రాబట్టనున్నారు. అనంతరం.. క్షేత్రస్థాయిలో నాటు సారాయి తయారీని, విక్రయాల్ని పూర్తిగా నిరోధించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
Also Read : వీడి క్రూరత్వం ఎవరూ ఊహించలేదు.. కడుపులోని బిడ్డ బయటకి వచ్చేలా హత్య..
కాగా.. ఈ కేసులో శివకాంత్, మహ్మమద్ బాబా, అరుణ్ నాయక్, హీరా సింగ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ మీడియాకు వెల్లడించారు. ఈ నలుగురూ ప్రధాన నిందితులుగా తెలిపిన పోలీసులు.. నల్ల బెల్లం సరఫరాకు సహకరించిన నరేష్, శ్రీను అనే ఇద్దరు వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే.. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నాటు సారాయి తయారీకి ఉపయోగపడే నల్ల బెల్లం విక్రయాలపై తెలుగు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు ఉండడంతో.. కర్ణాటకలోని బసవ కళ్యాణం అనే ప్రాంతం నుంచి తరచూ కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నట్లు నిందితులు వెల్లడించారు. అక్కడి నుంచి పహాడి షరీప్ ప్రాంతంలో భారీగా నిల్వ చేస్తూ.. వివిధ ప్రాంతాలకు విక్రయాలు జరుపుతున్నారు.