Hyderabad Crime : భార్య ఏడు నెలల గర్భవతి, అప్పటికే ఓ బాబు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన భర్త విచక్షణ మరిచాడు. తాను మనిషిని అన్న ఇంగితం మర్చిపోయి.. భార్య కడుపుపై కూర్చున్నాడు. ఊపిరాడకుండా చేసి చంపాలని దిండుతో అదిమి.. రాక్షసానందం పొందాడు. ఫలితం.. తల్లి కడుపులోని బిడ్డ నెత్తురు కక్కుతూ బయటకు వచ్చి పడింది. నిండు చూలాల భార్య.. కన్ను మూసింది. ఇదీ.. ఇటీవల హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఓ విషాధ ఘటన. తొలుత అనుమానాస్పద మృతిగానే అనుకున్న తర్వాత కానీ.. ఈ క్రూరుడి దుర్మార్గం బయటపడింది.
హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ ప్రాంతానికి చెందిన అతిపాముల సచిన్ అనే యువకుడికి రెండేళ్ల క్రితం.. ఇన్స్టాగ్రామ్లో కాప్రాకు చెందిన స్నేహ అనే ఓ యువతి పరిచయం అయ్యింది. పరిచయం కాస్తా ప్రేమగా మారగా.. వాళ్లిద్దరు 21 ఏళ్ల వయసులో 2022లో వివాహం చేసుకున్నారు. ప్రేమ కాస్తా బాధ్యతగా మారడంతో.. కుటుంబాన్ని పోషించేందుకు సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్ గా సిటీలో పనిచేశాడు. ఆ వచ్చిన కాస్త సొమ్ముతో భార్యను చూసుకుంటున్నాడు. ఏడాది తిరిగే సరికి వీరికి ఓ బాబు పుట్టాడు. అప్పటి వరకు బాగానే ఉన్న సంసారం.. క్రమంగా పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందిలా మారింది.
పెళ్లైన కొత్తలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తూ కాస్త తిండిపెట్టిన సచిన్.. తర్వాత, తర్వాత జులాయిగా తిరుగడం మొదలుపెట్టాడు. చెడు వ్యసనాలతో బతుకును నరకప్రాయంగా చేసుకున్నాడు. తనతో పాటు అతని భార్య బిడ్డల జీవితాల్ని రోడ్డుపైకి తీసుకు వచ్చాడు. ఓ వైపు పెరిగిపోతున్న ఖర్చులు, మరోవైపు జులాయి తిరుగుడుతో.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అప్పుడే.. మరింత దారుణంగా మారిపోయాడు సచిన్.. మనిషి కాస్తా బాధలు, కష్టాలు పోగయ్యే వరకు రాక్షసుడిలా మారిపోయాడు. అప్పటి వరకు ప్రేమ అంటూ వెంటపడ్డ వాడు కాస్తా.. ఏడాది తిరిగే సరికి పుట్టిన బిడ్డను పాతబస్తీకి చెందిన ఓ కుటుంబానికి అమ్మకానికి పెట్టాడు.
కన్న పేగు బంధంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. బిడ్డను అమ్ముకోవడానికి ససేమిరా అంది. కాదన్న భర్త సచిన్ గురించి తెలుసుకున్న అతని భార్య స్నేహ కుషాయిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతని ప్రయత్నాలకు అడ్డుతగిలిన పోలీసులు.. బిడ్డను రక్షించి తిరిగి తల్లి చెంతకు చేర్చారు. మరోసారి ఇలా జరిగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ హెచ్చరించి వదిలేశారు. కానీ.. పోషణ లేకుపోవడం, తల్లిదండ్రుల గొడవల మధ్య.. అనారోగ్యంతో కొన్నాళ్లకే చిన్నారి బాబు మృత్యువాత పడ్డాడు.
ప్రేమ కాస్త గొడవలు, కొట్లాటలుగా మారిపోయింది. పెళ్లికి ముందు ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమ అంటే ప్రాణం అనుకున్న ఇద్దరు.. ఆ తర్వాత కొన్నేళ్లకే సంసారం బంధంలో శత్రువులుగా మారిపోయారు. వారి మధ్య గొడవలు, తగవులు సాధారణం అయిపోగా.. ఇద్దరూ కొన్నాళ్లుగా దూరంగా ఉన్నారు. ఇటీవలే వీరిద్దరి మధ్య సయోధ్య కుదరగా.. చాన్నాళ్లుగా దూరంగా ఉన్న భార్య భర్తలు.. డిసెంబర్ 11 నుంచి కాప్రాలో ఓ గదిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. కలిసిన కొన్ని రోజులకే.. మళ్లీ గొడవలతో వారి సంసారం నరకంగా మారిపోయింది. అదే సమయంలో.. తన భార్య 7 నెలల గర్భవతి అని తెలుసుకుని.. సచిన్ రోజు గోడవ చేస్తున్నాడు. తాను దూరంగా ఉంటే.. గర్భం ఎలా వచ్చింది అంటూ నానా రభస చేస్తున్నాడు. అందులో భాగంగానే.. ఇటీవల ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించి… ఎవరూ ఊహించని కర్కషత్వానికి పాల్పడ్డాడు.
డిసెంబర్ నుంచి రోజు గొడవలు, కొట్లాటలతో భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో.. భార్యను చంపేందుకు సచిన్ పథకం రచించాడు. జనవరి 16న తెల్లవారుజామున 5 గంటల సమయంలో.. భార్యతో గొడవకు దిగిన సచిన్.. తన ఏడు నెలల గర్భంతో తనకు సంబంధం లేదని తిడుతూ.. ఆమెపై చేయిచేసుకున్నాడు. భార్య గర్భంతో ఉంది అని కూడా చూడకుండా.. కడుపుపై కూర్చున్నాడు. ఓ వైపు.. ఏడు నెలల గర్భంతో తీవ్ర పెనుగులాటలో ఉన్న భార్యను దిండుతో అదిమాడు. ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి.. నిండు చూలాల భార్యను హతమార్చాడు. అతను చేసిన దుర్మార్గానికి.. గడుపులోని బిడ్డ కూడా బయటకి వచ్చింది. తీవ్ర రక్తస్రావం.. ఊపిరాడకపోవడంతో నిముషాల్లోనే స్నేహ మృతి చెందింది.
Also Read : క్రిప్టో పేరుతో అమెరికాకు కుచ్చుటోపి.. ఎన్ని వేల కోట్లు దోచాడో తెలిస్తే షాక్..
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు.. తొలుత అనుమానాస్పద మృతిగా భావించారు. కానీ.. దర్యాప్తు చేపట్టగా మృతురాలి భర్త సచిన దుర్మార్గం బయటపడింది. దీంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. అతనిపై కఠినమైన చట్టాల్ని పెట్టి.. కటకటాలపాల్జేశారు.