Father Kills Son: వావివరసలు మరిచి.. కన్నకొడుకునని కూడా చూడకుండా ఓ తండ్రి, కట్టుకున్న భార్యతో కలిసి కిరాతకానికి ఒడిగట్టారు. తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో జరిగిన గాదె అంజయ్య అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించడంతో ఈ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య ఉపాధి నిమిత్తం 2017లో విదేశాలకు వెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత తిరిగి గ్రామానికి వచ్చాడు. అయితే, అప్పటికే తన తండ్రి గాదె లచ్చయ్య, తన భార్య శిరీష మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని అంజయ్యకు తెలిసింది. తండ్రి, భార్య తీరును గమనించిన అంజయ్య వారిని పలుమార్లు మందలించాడు. తమ బంధానికి అంజయ్య అడ్డుగా మారాడని భావించిన లచ్చయ్య, శిరీషలు అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన రవి, కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్లను సంప్రదించారు. పని ముగించేందుకు రూ.3 లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా రూ.1,25,000 ముందస్తుగా చెల్లించారు. పథకం ప్రకారం.. నిందితులు అంజయ్యకు మద్యం తాగించి, మత్తులో ఉండగా గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని కెనాల్లో పడేశారు.
అంజయ్య మృతిపై అనుమానంతో విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాలను వెలుగులోకి తెచ్చారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాహేతర సంబంధం కారణంగానే తండ్రి, భార్య కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపారు. హత్యలో పాల్గొన్న నిందితులందరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. పవిత్రమైన బంధాలకు మచ్చ తెచ్చేలా తండ్రీకొడుకుల మధ్య, భార్యాభర్తల మధ్య జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Also: Nizamabad district: జ్యువెలరీ షాప్ షటర్లు పగలగొట్టి 34 తులాల గోల్డ్ చోరీ.. నిజామాబాద్లో ఘటన