Nizamabad district: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. గత కొంతకాలంగా వరుస దొంగతనాలతో వణికిపోతున్న బోధన్ పట్టణంలో మరోసారి దుండగులు బరితెగించి ఏకంగా జువెలరీ షాపునే లక్ష్యంగా చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఒక ప్రముఖ జువెలరీ షాపులో ఈ చోరీ చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో వచ్చిన గుర్తుతెలియని దుండగులు.. షాపు ప్రధాన షట్టర్లను ఇనుప రాడ్లతో పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అత్యంత చాకచక్యంగా లోపల ఉన్న విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిన యజమాని షట్టర్లు విరిగి ఉండటం చూసి షాక్ అయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న బోధన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సభ్యులను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలను, అలాగే పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పక్కా రెక్కీ నిర్వహించిన తర్వాతే ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు 34 తులాల బంగారం, 16 కిలోల వెండి, లక్ష రూపాయల నగదు చోరీకి గురైనట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి వంటి రద్దీ ప్రాంతంలోనే దొంగలు ఇంత సాహసానికి ఒడిగట్టడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. వరుసగా జరుగుతున్న దొంగతనాలు స్థానిక వ్యాపారులను, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసులు రాత్రిపూట గస్తీని మరింత పెంచాలని, నిందితులను త్వరగా పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని స్థానిక వ్యాపార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.