KBC Winner Arrest: మధ్యప్రదేశ్కు చెందిన తహశీల్దార్ అమితా సింగ్ తోమర్ అరెస్ట్ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేసిన ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) షోలో 2019లో ఆమె పాల్గొనడమే ఇందుకు ప్రధాన కారణం. అప్పట్లో ఆమె రూ.50 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకొని ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన ఆమె ఇన్నాళ్ల తర్వాత అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లడం అందిరినీ విస్మయానికి గురిచేసింది.
ఒక ప్రభుత్వ అధికారిణిగా షోలో పాల్గొనడంతో పాటు షోలో ఆమె చూపిన ప్రతిభను అప్పట్లో హోస్ట్ అమితాబ్ బచ్చన్ పెద్ద ఎత్తున మెచ్చుకున్నారు. ఆ సమయంలో ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. అలాంటి ఆమెను మార్చి 26న.. అవినీతి ఆరోపణలతో గ్వాలియర్ పోలీసులు అరెస్ట్ చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. అంతేకాకుండా ఆమెను శివపురిలోని మహిళా జైలుకు సైతం తరిలించారు.
షియోపూర్ జిల్లాలోని విజయ్ పూర్ లో 2021 ప్రాంతంలో తోమర్ తహసీల్దార్ గా పనిచేశారు. ఆ సమయంలో వచ్చిన వరదలకు సంబంధించి విడుదలైన రూ. 2.5 కోట్ల వరద సహాయక నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. అనర్హులకు లబ్ధి చేకూర్చేలా ఫోర్జరీ పత్రాలను సృష్టించి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని విచారణలో తేలింది. ఈ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు తోమర్ ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో పోలీసులు ఆమెను గ్వాలియర్లోని నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెతో పాటు మరో 22 మంది పట్వారీలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.
Also Read: BSNL IPL Plan: జియో హాట్స్టార్, సోనీ లివ్, జీ5 ఫ్రీ.. బిఎస్ఎన్ఎల్ ఐపిఎల్ ధమాకా ప్లాన్ లాంచ్
అయితే మహిళా తహసీల్దార్ తోమర్ ఎలాంటి తప్పు చేయలేదని ఆమె తరపు లాయర్లు వాదిస్తున్నారు. లబ్ధిదారుల జాబితాలు, బ్యాంకు వివరాలను పట్వారీలు తయారుచేసి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, నాయిబ్ తహసీల్దార్లు ధృవీకరించిన తర్వాతే ఆమె సంతకం చేశారని గుర్తుచేశారు. తోమర్ ఖాతాల్లోకి నష్టపరిహార సొమ్ము వెళ్లిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టులో తెలియజేస్తున్నారు. అయితే వారి వాదనతో కోర్టు ఏకీభవించకపోవడంతో తోమర్ అరెస్టు చోటుచేసుకుంది. అయితే ఈ అరెస్టుకు ఒక రోజు ముందు షియోపూర్ జిల్లా కలెక్టర్ అర్పిత వర్మ.. తోమర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.