Malkajgiri Murder: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి మర్డర్ కేసు నిందితుల్ని పోలీసులు గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అతనికి తుపాకీని సమకూర్చిన మరో ఇద్దరు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. మల్కాజిగిరి జోన్ డీసీపీ సీహెచ్.శ్రీధర్, అదనపు డీసీపీ రామ్ కుమార్, ఏసీపీ యాదగిరి రెడ్డితో కలిసి గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మల్కాజిగిరి మారుతీనగర్ నివాసి అరుణ్ కుమార్ (48) రియల్టర్. 2002లో బొల్లారం ప్రాంతానికి చెందిన స్వర్ణలతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత వీరికి ఓ కొడుకు, కూతురు పుట్టారు. కాగా 2015లో స్వర్ణలత క్యాన్సర్ వ్యాధికి గురైంది. దాంతో ఆమె భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో అరుణ్ కుమార్ తన మొదటి భార్య చెల్లెలు నిషారాణిని 2022లో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా నిషారాణి మొబైల్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో అరుణ్ కుమార్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచూ భౌతిక దాడులకు పాల్పడటంతోపాటు మానసికంగా వేధించటం మొదలు పెట్టాడు. వీటిని భరించలేక పోయిన నిషారాణి మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.
ఆ తరువాత కొన్నిరోజులకే అరుణ్ కుమార్ అంబర్ పేట పోలీసులకు తుపాకీతో పట్టుబడ్డాడు. ఈ మేరకు అతనిపై మారణాయుధాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసిన అంబర్ పేట పోలీసులు.. జైలుకు రిమాండ్ చేశారు. బెయిల్ పై విడుదలైన తరువాత భార్య నిషారాణిని హత్య చేయాలని అరుణ్ కుమార్ నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో తుపాకీ ఇప్పించాలని యాఖుత్ పురాకు చెందిన డిగ్రీ విద్యార్థి అయిన మీర్ ముజమ్మిల్ అలీఖాన్ ను అరుణ్ కుమార్ అడిగాడు. సరే అన్న మీర్ ముజమ్మిల్ అలీఖాన్.. మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన హరీందర్ సింగ్ అలియాస్ హర్భజన్ సింగ్ నుంచి అరుణ్ కుమార్ కు తుపాకీ ఇప్పించాడు. ఈ తుపాకీతో నగర శివార్లలోని నిర్జన ప్రదేశంలో అరుణ్ కుమార్ ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు.
అనంతరం కుట్రలో భాగంగా ఇటీవల మాట్లాడుకుందామని చెప్పి నిషారాణిని ఇంటికి పిలిపించుకున్నాడు. బుధవారం తెల్లవారుఝాము 4.30 గంటల సమయంలో మరోసారి భార్యతో గొడవ పడ్డాడు. ఆ వెంటనే తుపాకీతో ఆమె తలపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దాంతో నిషారాణి అక్కడికక్కడే చనిపోయింది. ఆ వెంటనే అరుణ్ కుమార్ పారిపోయాడు. గడ్డం సంతోష్ యాదవ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి సీఐ సత్యనారాయణ కేసులు నమోదు చేశారు.
అనంతరం గాలింపు నిర్వహించి గంటల వ్యవధిలోనే అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి తుపాకీ, మూడు లైవ్ బుల్లెట్లు, రెండు బటన్ నైఫ్ లు, మరో రెండు కత్తులు, ఓ సర్జికల్ బ్లేడ్, మారుతీ బాలెనో కారును స్వాధీనం చేసుకున్నారు. గంటల వ్యవధిలోనే నిందితున్ని అరెస్ట్ చేసిన సిబ్బందిని డీసీపీ శ్రీధర్ అభినందించారు. పరారీలో ఉన్న హరీందర్ సింగ్, మీర్ ముజమ్మిల్ అలీఖాన్ ల కోసం గాలింపు కొనసాగుతున్నట్టు చెప్పారు.
Also Read: Smart Gadgets: ఇల్లు మీది.. పని వాటిది.. మీ శ్రమను తగ్గించే 5 స్మార్ట్ గ్యాడ్జెట్స్!