Anantapur Incident: అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో అత్యంత హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల కుమారుడు “అమ్మా చావొద్దు” అంటూ కన్నీళ్లతో బతిమాలినా, ఆ తల్లి మనసు కరగలేదు. భర్త చేసిన మోసం కలిగించిన గాయం ముందు ఆ పసివాడి వేడుకోలు ఓడిపోయాయి. కన్నకొడుకు చూస్తుండగానే ఆ మాతృమూర్తి ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు వదలడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వేధించిన వివాహేతర సంబంధం
ఆత్మకూరు మండలంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మోహన్ కృష్ణకి, ముచ్చకోటకు చెందిన లలిత(30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న విషయం తెలిసినప్పటి నుండి లలిత మానసిక వేదనకు గురైంది. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు జరిగి, గత కొంతకాలంగా వారు విడివిడిగా ఉంటున్నారు.
న్యాయం కోసం పోరాడినా దక్కని ఫలితం
భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, లలిత కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితమే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్)లో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కట్టుకున్న వాడి నుండి వేధింపులు ఆగుతాయని, తనకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశించింది. కానీ, మనస్తాపం నుండి కోలుకోలేక మంగళవారం ఉదయం తన నివాసంలోనే బలవన్మరణానికి పాల్పడింది.
ఖాకీ ముసుగులో కసాయి భర్త
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉండి, భార్య మరణానికి కారణమయ్యాడంటూ మృతురాలి బంధువులు సదరు కానిస్టేబుల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక, భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి లలిత ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. తన తండ్రి చేస్తున్న అకృత్యాలు, తల్లి పడుతున్న నరకం ఆ తొమ్మిదేళ్ల ధర్మయోగికి తీరని వేదనను మిగిల్చాయి.
Also Read: అగ్రికల్చర్ ఆఫీస్లో ఆకస్మికంగా ఏసీబీ రైడ్స్.. బయటపడ్డ సంచలనాలు
కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం
సమాచారం అందుకున్న నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ జగదీశ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. లలిత తండ్రి సాయిప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యుడైన కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, తదుపరి విచారణ జరుపుతున్నారు.