ACB Raids: విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ అధికారులు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. దీంట్లో మండల వ్యవసాయ అధికారి అవినీతి లీలలు వెలుగు చూశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో అక్రమాలు, అవినీతి జరుగుతున్నట్టుగా ఇటీవలిగా ఏసీబీ అధికారులకు వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఏసీబీ అధికారులు బృందంగా ఏర్పడి ఆఫీస్లో తనిఖీలు జరిపారు. దీంట్లో అక్రమంగా విత్తనాలను నిల్వ చేయటం, నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ఎనిమిది సంస్థలపై కేసులు నమోదు చేయాల్సి ఉండగా సదరు అధికారి ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిర్ధారణ అయ్యింది.
ఇక, ఆఫీస్లో అటెండెన్స్ రిజిష్టర్ ను కూడా సరిగ్గా మెయిన్ టెయిన్ చేయటం లేదని తేలింది. రైతు భీమాకు సంబంధించి 35 దరఖాస్తులు రాగా వాటిలో అయిదింటిని ఉద్దేశ్యపూర్వకంగా పెండింగ్లో పెట్టినట్టుగా వెల్లడైంది. ఇక, కార్యాలయంలో రైతు భరోసాకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు అందుబాటులో పెట్టలేదని తేలింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల స్టాక్ లను తనిఖీ చేయటంతోపాటు రిజిష్టర్లలో స్టాంపులు వేయాల్సి ఉండగా ఆ పని కూడా చేయటం లేదని వెల్లడైంది. రైతుల శిక్షణ రిజిష్టర్ ను కూడా నిర్వహించటం లేదని స్పష్టమైంది. ఆరు ఫార్మ్ మెకనైజేషన్ దరఖాస్తులు రాగా వాటిని కూడా పెండింగ్ లో పెట్టినట్టుగా తేలింది.
Also Read: Damodar Rajanarasimha: హరీష్ రావుకు మంత్రి దామోదర రాజనర్సింహా స్ట్రాంగ్ కౌంటర్..!
నిబంధనల ప్రకారం ఈ దరఖాస్తు ఫారాలను మూడు రోజుల్లోపు జిల్లా వ్యవసాయ అధికారి వద్దకు పంపించాల్సి ఉంది. అయితే, 45రోజులుగా తన వద్దనే పెట్టుకుని దరఖాస్తుదారులను ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నట్టుగా వెల్లడైంది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా ప్రైవేట్ వ్యక్తిని నియమించుకుని అతనితో అధికారిక విధులు చేయిస్తున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. దాంతోపాటు మండల వ్యవసాయ అధికారికి యూపీఐల ద్వారా పలుమార్లు అనుమానాస్పద నగదు బదిలీలు జరిగినట్టుగా స్పష్టమైంది. ఈ మేరకు ఏసీబీ అధికారులు నివేదికను సిద్ధం చేసి తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి సమర్పించనున్నారు.