Narsingi Minor Rape Case: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పుప్పాలగూడలో తన అమ్మమ్మ వద్ద ఉంటూ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న పదహారేళ్ల బాలిక ఈ ఘాతుకానికి బలయ్యింది. ఈ నెల 16వ తేదీ ఉదయం పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక సాయంత్రం నాలుగు గంటలైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు 137(2) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా బాలిక ఒక మైనర్ బాలుడితో కలిసి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. సదరు మైనర్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. 17వ తేదీ ఉదయం ఫిర్యాదు అందగా పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో రాత్రి రెండు గంటల సమయానికి నిందితులు ఉన్న లొకేషన్ను కనుగొన్నారు.
చెంగిచెర్లలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో బాలికను బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యాచారానికి ముందు బాధితురాలికి మద్యంతో పాటు గంజాయిని మత్తుగా ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరుసటి రోజు పోలీసులు అక్కడికి చేరుకునే వరకు నిందితులు బాలికతో పాటు అదే ప్రాంగణంలో ఉండటం గమనార్హం. నిందితుల్లో ఒకరు మేజర్ కాగా మిగిలిన ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. ఘటనాస్థలంలో ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో మేజర్ నిందితుడిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి చంచల్గూడ జైలుకు తరలించారు. మైనర్ నిందితుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం. ఈ కేసులో మరో మైనర్ బాలుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు త్వరలోనే అతడిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థినిని మాయమాటలతో తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చి దారుణానికి ఒడిగట్టిన ఈ ఘటన స్థానికంగా పెను విషాదాన్ని నింపింది.
Read Also: Nellore Murder: గిద్దలూరులో దారుణం.. లవర్ తో కలిసి భర్తను చంపి చెరువులో.. అసలేం జరిగిందంటే..?