Congress: ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు , పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో హైకమాండ్ నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పనితీరుపై రాహుల్ గాంధీ, ఖర్గే సమగ్ర సమీక్ష నిర్వహించారు.
సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో మెజారిటీ పథకాలను అమలు చేసిందని.. మిగిలిన హామీలను వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయిలో నెరవేర్చి ప్రజల మెప్పు పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు విడిచి వెళ్లినప్పటికీ.. ఉన్న నిధులను చాకచక్యంగా వినియోగిస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండటాన్ని హైకమాండ్ ప్రశంసించడమే కాకుండా.. ఇతర వాణిజ్య పంటలను కూడా ప్రోత్సహించాలని సూచించింది.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం మంది ప్రజలు కాంగ్రెస్కు మద్దతు తెలపడంపై హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ జోష్తోనే త్వరలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవుల భర్తీ, అలాగే మార్చి 15 లోపు పార్టీ సంస్థాగత పదవుల భర్తీ, అదే విధంగా.. రాజ్యసభ ఎన్నికలు కోసం రెండు మూడు రోజుల్లో సీఎం, పీసీసీ చీఫ్లతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాల గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశం కూడా చర్చకు రాగా.. ఆయనను త్వరలోనే ఢిల్లీకి పిలిచి మాట్లాడాలని అధిష్టానం నిర్ణయించింది. మంత్రివర్గ విస్తరణపై ప్రస్తుతానికి ఎటువంటి చర్చ జరగలేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలా హామీలను విస్మరించబోమని.. అన్ని గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేశాకే వచ్చే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.
Also Read: గిద్దలూరులో దారుణం.. లవర్ తో కలిసి భర్తను చంపి చెరువులో.. అసలేం జరిగిందంటే..?
PIC OF THE DAY: ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా తెలంగాణ మంత్రులు https://t.co/C34bRT6sCK pic.twitter.com/WCLRcIABDf
— BIG TV Breaking News (@bigtvtelugu) February 19, 2026