Youth Suicide: తన కోసం ద్విచక్ర వాహనాన్ని తండ్రి కొనుగోలు చేయలేదనే మనస్తాపంతో.. ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్ము తాండాకు చెందిన భూక్య వెంకటేష్ (21) అనే యువకుడు తన తండ్రి భూక్య బలిరామ్ ను కొంతకాలంగా బైక్ కొనివ్వాలని కోరుతున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బలిరామ్ బైక్ కొనివ్వలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తండ్రి, కుమారుడి మధ్య మాటల వివాదం జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేష్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగినట్లు సమాచారం. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో, చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కుమారుడి మృతితో తండ్రి బలిరామ్, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఒక బైక్ కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేకపోయాం అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
Also Read: హైదరాబాద్లో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య.. ఘటన వెనుక సీనియర్లు? ముమ్మాటికీ ర్యాగింగ్ కారణమా?
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడటానికి గల పూర్తి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.