Parvathipuram Tragedy: ఫ్యామిలీ సమస్యలు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. భార్యభర్తలు కూర్చొని సమస్యల గురించి చర్చించుకుంటే తగ్గేవి. కానీ అవేమీ చేయలేదు.. పంతాలకు పోయారు. చివరకు వారితోపాటు పిల్లలకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఇద్దరు పిల్లల్లో ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది.
పార్వతీపురం మన్యం జిల్లా దారుణం
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని వనజ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతులు మీనాక మధు-భార్య సత్యవతి. వారి నాలుగేళ్ల కుమార్తె మోస్యగా పోలీసులు గుర్తించారు.
నిండు నూరేళ్లూ కలిసి ఉండాల్సిన దంపతులు, పసిపాపతో సహా తనువు చాలించడం అందరినీ కలిచివేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాలు ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణమని స్థానికుల మాట. దంపతుల మధ్య తలెత్తిన మనస్పర్థలు తీవ్రరూపం దాల్చాయి. చివరకు తీవ్ర మనస్తాపానికి గురైనవారు తమ ఇద్దరు కుమార్తెలకు విషం ఇచ్చి, అనంతరం వారు సేవించినట్లు తెలుస్తోంది.
తల్లిదండ్రులే ఆ పిల్లలకు శాపం
ఈ ఘటనలో మరో కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఆమెను చికిత్స నిమిత్తం తక్షణం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాల కోసం వైద్యులు పోరాడుతోంది. అక్కడి సమీపంలోని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
క్లూస్ టీమ్, స్థానిక పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టి, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడంపై గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read: పాపం పసివాడు.. ఐదేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్ అధికారులు
ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? కేవలం కుటుంబ గొడవలే కారణమా అనే అంశాలను ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా, సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, చిన్న పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించకుండా ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం అత్యంత బాధాకరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.