Punjab Crime News: పంజాబ్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. టార్న్ తరణ్ జిల్లాలోని ఒక లా కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతున్న సందీప్ కౌర్ అనే విద్యార్థిని, ఆమె తోటి విద్యార్థి ప్రిన్స్ రాజ్ క్లాస్రూమ్లోనే తుపాకీతో కాల్చి చంపడం తీవ్ర సంచలనం సృష్టించింది. నిత్యం విద్యార్థులతో సందడిగా ఉండాల్సిన విద్యాసంస్థ ప్రాంగణం ఈ రక్తపాతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తరగతులు జరుగుతున్న సమయంలోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టడంతో తోటి విద్యార్థులు, అధ్యాపకులు భయాందోళనలకు గురయ్యారు.
ఘటనా వివరాల ప్రకారం, నిందితుడు ప్రిన్స్ రాజ్ ఒక్కసారిగా సందీప్ కౌర్పై కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన తర్వాత, నిందితుడు అదే తుపాకీతో తన తలపై కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన ప్రిన్స్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కాల్పుల వెనుక గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రేమ వ్యవహారం లేదా వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అసలు కాలేజీ లోపలికి తుపాకీ ఎలా వచ్చింది? భద్రతా పరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే తరగతి గదిలో ఈ తరహా హింస చోటుచేసుకోవడం విద్యావ్యవస్థలోని భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పంజాబ్లో దారుణం.. క్లాస్రూమ్లోనే విద్యార్థిని కాల్చివేత
పంజాబ్లోని టార్న్ తరణ్ జిల్లాలో ఘోరం జరిగింది. లా కాలేజీ క్లాస్రూమ్లో తోటి విద్యార్థి ప్రిన్స్ రాజ్, ప్రథమ సంవత్సర విద్యార్థిని సందీప్ కౌర్ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం నిందితుడు తన తలపై కాల్చుకొని ఆత్మహత్యాయత్నం… pic.twitter.com/RNr8KSpBlD— ChotaNews App (@ChotaNewsApp) February 9, 2026