Road Accident: నిర్మల్ జిల్లా భైంసా సమీపంలోని సత్ పూల్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కంటైనర్, కారు ఎదురెదురుగా అతివేగంతో రావడంతో ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అవ్వగా, నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులను కుబేర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన పటేల్ (42), రాజన్న (60), బాబన్న (70), కారు డ్రైవర్ సంతోష్గా గుర్తించారు.
అయితే ఈ ఘటన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించి హైదరాబాద్ నుండి తిరిగి వస్తున్న క్రమంలో, గమ్యస్థానానికి మరికొద్ది నిమిషాల్లో చేరుకుంటారనగా ఈ అనూహ్య ఘటన జరగడం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. మరణించిన నలుగురు కాకుండా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను రక్షించేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కారు లోపల మృతదేహాలు ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్ల సాయంతో వాటిని బయటకు తీసినట్లు సమాచారం.
Also Read: వినుకొండ RTC బస్స్టాండ్లో తొక్కిసలాట.. 4గురు స్పాట్లోనే..
సంఘటనా స్థలానికి చేరుకున్న భైంసా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం లేదా అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఒకే గ్రామానికి చెందిన వారు మృతి చెందడంతో ఆ గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోగా, పోలీసులు వాహనాలను పునరుద్ధరించారు.