సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఘోరం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు బాల్ రెడ్డి (50) గుర్తు తెలియని దుండగుల చేతిలో అత్యంత కిరాతకంగా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ దారుణకాండ చోటుచేసుకుంది. పట్టపగలే జరిగిన ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బాల్ రెడ్డి తన వ్యక్తిగత పని నిమిత్తం దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకున్న అనంతరం తన స్వగ్రామమైన చెల్లాపూర్కు బైకుపై బయలుదేరారు. రాజక్కపేట గ్రామ శివారు ప్రాంతానికి చేరుకోగానే మాటువేసిన దుండగులు ఆయనను అడ్డుకున్నారు. వెంట తెచ్చుకున్న కత్తులతో బాల్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. శరీరంలో కీలక భాగాలపై తీవ్రంగా గాయపరచడంతో ఆయన రక్తపు మడుగులో అక్కడికక్కడే మరణించారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తోంది. నిందితులు పక్కా పథకం ప్రకారమే ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని వెంటాడి వేటాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘోరానికి గల అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధానంగా రాజకీయ కక్షల వల్ల ఈ హత్య జరిగిందా…? లేక భూ వివాదాలు ఏమైనా ఉన్నాయా…? అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: ACB Arrest: ఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు.. ఒకేరోజు ఐదుగురు అరెస్టు.. ఎలా దొరికారంటే?