ACB Arrest: అధికారికంగా సహాయ పడేందుకు లంచం తీసుకున్న కోర్టు ఉద్యోగులు ముగ్గురిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోర్టుల్లో కలకలం సృష్టించిన ఈ ఉదంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్, సెషన్స్ కోర్టులో జరిగింది.
పాలకుర్తి సాయిచరణ్.. డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో గ్రేడ్ 1 స్టెనోగా పని చేస్తున్నాడు. అతని వద్ద కొమ్ము సునీత, పున్నం రజితలు సహోద్యోగులు. ఓ కేసుకు సంబంధించి కొన్ని రోజుల క్రితం కోర్టు ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ కాపీ కావాలని ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ కాపీ ఇవ్వటానికి సాయిచరణ్, సునీత, రజితలు లంచం డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు శుక్రవారం మాటు వేసి సాయిచరణ్, సునీత, రజితలు 5వేల రూపాయలను లంచంగా తీసుకోగానే దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసి వరంగల్ లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో ముగ్గురిని జైలుకు తరలించారు.
మరో ఘటనలో సబ్ రిజిస్ట్రార్ తోపాటు అతనికి సహకరించిన ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో కాసర్లీ రాజేందర్ సబ్ రిజిస్ట్రార్ గా పని చేస్తున్నాడు. కాగా, కొంత భూమిని కొన్న ఓ వ్యక్తి దానిని రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. ఆఫీస్ బయట ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ గా పని చేస్తున్న రషీద్ ను కలవాలని సూచించటంతో భూమి రిజిస్ట్రేషన్ కోసం అతన్ని కలిశాడు.
ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే సబ్ రిజిస్ట్రార్ కు కొంత నగదు ఇవ్వాల్సి ఉంటుందని రషీద్ చెప్పాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు నిందితులను పట్టుకునేందుకు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. రషీద్ లంచం డబ్బు రూ. 16,500 తీసుకోగానే దాడి చేసి పట్టుకున్నారు. విచారణలో సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ చెప్పినందుకు డబ్బు తీసుకున్నానని రషీద్ వెల్లడించాడు.
Also Read: TG High Court: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. హైకోర్టులో మళ్లీ అదే రిపీట్
ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం కరీంనగర్ లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో ఇద్దరిని జైలుకు తరలించారు. కాగా అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీడీ డీజీపీ చారు సిన్హా సూచించారు. దాంతోపాటు 9440446106 నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చన్నారు.
Also Read: Vijay Rashmika wedding: విజయ్ రష్మిక వెడ్డింగ్ ఇన్విటేషన్ తో పాటు ఇచ్చిన గిఫ్ట్ ఇవే!