Rajanna Siricilla district: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగుచూసింది. అల్లరి చేస్తున్నాడన్న నెపంతో, అభం శుభం తెలియని మూడున్నరేళ్ల బాలుడిపై ఓ అంగన్వాడీ టీచర్ కర్కశంగా వ్యవహరించారు. క్రమశిక్షణ నేర్పాల్సిన చేతులే ఆ చిన్నారిపై దాష్టీకానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గురుకులం వంటి అంగన్వాడీ కేంద్రంలోనే రక్షణ కరువైందని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొంపెల్లి లక్ష్మి, విజయ్ కుమార్ దంపతుల కుమారుడు విద్వాన్ష్ స్థానిక అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. ఎప్పటిలాగే ఈనెల 10వ తేదీన (మంగళవారం) బాలుడిని తల్లి కేంద్రంలో విడిచి వెళ్లారు. అయితే, మధ్యాహ్నం సమయంలో అంగన్వాడీ టీచర్ రాణి ఫోన్ చేసి, బాబుకు జ్వరం వచ్చిందని ఇంటికి తీసుకెళ్లాలని లక్ష్మికి సమాచారం ఇచ్చారు. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి, విద్వాన్ష్ పరిస్థితి చూసి ఆ తల్లి షాక్కు గురయ్యారు. బాలుడి కుడి కన్ను తీవ్రంగా ఉబ్బిపోయి, ఒళ్లంతా గాయాలతో కన్పించాడు.
జ్వరం అని అబద్ధం చెప్పి, చిన్నారిపై జరిగిన దాడిని దాచిపెట్టేందుకు టీచర్ ప్రయత్నించడం ఇక్కడ గమనార్హం. కేవలం అల్లరి చేశాడన్న కోపంతోనే టీచర్ విద్వాన్ష్ను చితకబాదినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి సమయానికి బాలుడి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో, తండ్రి విజయ్ కుమార్ బుధవారం పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడి కంటి చూపుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై ఎస్సై రాహుల్ రెడ్డి స్పందిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, సీడీపీవో ఉమారాణిలు ప్రాథమిక విచారణ జరిపారు. సదరు అంగన్వాడీ టీచర్ నుంచి వివరణ సేకరించామని, పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేశామని జిల్లా సంక్షేమాధికారి పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, పసివాడిపై దాడికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: హైదరాబాద్ కేపీహెచ్బీలో భారీ అగ్నిప్రమాదం.. హీరో షోరూంలో ఎగిసిపడిన మంటలు
చిన్నారిపై జరిగిన ఈ అమానుష ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో పిల్లలను నమ్ముకుని పంపే తల్లిదండ్రులకు ఈ ఘటన భయాందోళన కలిగిస్తోంది. బాధితుడికి మెరుగైన వైద్యం అందించి, అనాగరికంగా ప్రవర్తించిన టీచర్ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.