Jodhpur Crime: రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో దారుణం..
రాజస్థాన్లో జోధ్పూర్ జిల్లాలోని మనై గ్రామం. ఆ గ్రామానికి చెందినవారు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఒకరి పేరు 25 ఏళ్ల శోభ కాగా, మరొకరి విమల వయస్సు 23 ఏళ్లు. ఇద్దరు ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి ఇటీవల పెళ్లి సంబంధాలు కుదిరాయి. శనివారం వీరిద్దరికి వివాహానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంట్లో పెళ్లి వేడుకలు, సంప్రదాయంగా వచ్చే బంధోలి వేడుకలతో వారిళ్లంతా సందడిగా మారింది. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా వీరి ఆరోగ్యం విషమించింది. వెంటనే కుటుంబ సభ్యులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
వివాహానికి కొన్ని గంటల ముందు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను ఇంటికి తీసుకొచ్చారు. ఎవరికీ చెప్పకుండానే అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ విషయం తెలియగానే అమ్మాయిల మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఐదు నిమిషాల్లో అంత్యక్రియలు జరగాల్సి ఉండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మృతదేహాలు నీలి రంగులోకి మారడంతో విషప్రయోగం జరిగిందని నిర్ధారించారు.
ఇది ముమ్మాటికీ ఆత్మహత్య అని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. బాధితుల బాబాయిలు వివాహం విషయంలో వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని మేనమామ ప్రధాన ఆరోపన. తొలిసారి కుదిరిన వివాహం రద్దు చేసి, బాబాయిల పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో పెళ్లి నిశ్చయించారని అన్నాడు. బలవంతపు పెళ్లి ఇష్టం లేక అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నాడు.
ALSO READ: బాత్రూంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. కారణం ఇదే?
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ప్రాథమిక దర్యాప్తులో పురుగుల మందు తాగినట్లు తేలింది. ఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం శోభ-విమల కుటుంబసభ్యులను విచారిస్తున్నారు పోలీసులు. అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.