Warangal accident: వరంగల్లో నేడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హంటర్ రోడ్డులోని బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ సమీపంలో సుమారు 8 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది, దీంతో లోపల ఉన్న వారు తీవ్ర రక్తగాయాలతో అల్లాడిపోయారు.
ప్రమాదానికి గురైన వారు హన్మకొండ నుండి కక్కిరాలపల్లి, పెద్దకుంట తాండలోని ప్రభుత్వ పాఠశాలలకు విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఉదయ శ్రీ, కవిత, సురేఖ, నరసింహ రెడ్డి వీరందరు కక్కిరాలపల్లి స్కూల్ కి చెందినవారు, వీరలింగం పెద్దకుంట తాండ స్కూల్ కి చెందిన వారు కారులో ఉన్నారు. వీరంతా ప్రతిరోజూ తమ విధులకు ఇదే విధంగా కారులో కలిసి వెళ్తుంటారని సమాచారం. ఉపాధ్యాయులైన వీరు విద్యాబోధన కోసం వెళ్తున్న క్రమంలో ఇలాంటి ప్రమాదం జరగడం స్థానికంగా విషాదం నింపింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు, కారులో ఇరుక్కుపోయిన ఉపాధ్యాయులను అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు ఉండగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read: రెప్పపాటులో ఘోరం.. కారులోంచి జారిపడిన చిన్నారి.. గుండె ఆగిపోయే దృశ్యం!
రోడ్డు ప్రమాద వార్త తెలియగానే తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఆసుపత్రికి చేరుకున్నారు. రద్దీగా ఉండే హంటర్ రోడ్డుపై భారీ వాహనాలు నియంత్రణ లేకుండా వెళ్లడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన టీచర్లకు అత్యవసర విభాగంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.