ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సారలమ్మ భర్త అయిన పగిడిద్దరాజు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామం నుండి బుధవారం మేడారానికి పయనమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పెనుక వంశీయులు పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సాంప్రదాయ బద్ధంగా స్వామివారిని మేడారానికి సాగనంపారు.
అట్టహాసంగా శోభయాత్ర..
పూనుగొండ్ల గ్రామం శివసత్తుల పూనకాలు, డోలీ వాయిద్యాలు, కొమ్ము బూరల మార్మోతతో ప్రతిధ్వనించింది. గిరిజన సాంప్రదాయం ఉట్టిపడేలా సాగిన ఈ శోభయాత్రకు ఎండోమెంట్ శాఖ అధికారులు, పెనుక వంశీయులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య పగిడిద్దరాజు పయనం అత్యంత వైభవంగా సాగింది.
శోభయాత్రలో పాల్గొన్న మంత్రి సీతక్క..
ఈ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వయంగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె శోభయాత్రలో పాలుపంచుకున్నారు. జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, భక్తులతో కలిసి సామాన్యురాలిలా ఆమె సందడి చేశారు.
మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ‘జాతర ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే ఇప్పటికే సుమారు 70 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. రేపటి నుండి ప్రారంభమయ్యే ఈ మహా కుంభమేళాకు సుమారు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది’ అని తెలిపారు.
భక్తులకు విజ్ఞప్తి చేస్తూ.. ‘కోట్లాది మంది తరలివచ్చే ఈ క్రమంలో భక్తులు ఎంతో ఓపికతో ఉండాలి. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమశిక్షణతో అమ్మవార్ల మొక్కులు చెల్లించుకోవాలి. అందరూ సహకరించి ఈ జాతరను విజయవంతం చేయాలని చేతులెత్తి మొక్కుతున్నాను’ అని ఆమె భావోద్వేగంతో కోరారు.రేపటి నుండి మేడారం గడ్డపై భక్తజన సంద్రం పోటెత్తనుంది. పగిడిద్దరాజు రాకతో జాతర వాతావరణం మరింత వేడెక్కింది.
ALSO READ: Medaram Jathara: మేడారం జాతరలో మహాఘట్టం.. పెళ్లికొడుకుగా పగిడిద్దరాజు