Birla Mandir: బిర్లా మందిర్ పగటి పూట పాలరాతి శిల్పంలా.. రాత్రిపూట మిణుగురు పురుగులా విద్యుత్ దీపాల కాంతులతో వెలుగులు విరుజిమ్ముతూ చూపరులను ఆకట్టుకుంటుంది. యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న బిర్లా మందిర్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. అక్కడే కొలువైన సతీసమేత శ్రీనివాసుడు.. స్వయంభూగా వెలిసిన హనుమంతుడు.. ఒక్కటేమిటి ఎన్నో ప్రత్యేకతలు కలిగింది బిర్లామందిర్. అటువంటి బిర్లా మందిర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ నడ్డిబొడ్డున రణగొణి ధ్వనుల మధ్య ఓ ప్రశాంతమైన ప్లేస్.. అందమైన పాలరాథితో చెక్కిన శిల్పాలు.. స్వాగత తోరణాలు దర్శనమిస్తాయి. అక్కడి ప్రాంగణంలోకి అడుగుపెడితే చాలు చెవిలోని ధ్వనులు సైలెంట్ అయిపోతాయి. మానసికమైన ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అదే బిర్లామందిర్.. ఇప్పటికి బిర్లామందిర్ నిర్మాణం జరిగి యాభై వసంతాలు పూర్తయ్యాయట. ఈ సందర్భంగా బిర్లామందిర్ గురించ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
బిర్లామందిర్ను బిర్లా ఫౌండేషన్ నిర్మించింది. దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించాలనే ఆశయంతో హిందూస్తాన్ ట్రస్ట్ బిర్లా ఫౌండేషన్కు అంకురార్పణ చేసింది. ఆ ఫౌండేషన్ ద్వారానే దేశంలో 35 ప్రధాన ప్రాంతాల్లో తిరుమల శ్రీవారి ఆలయాలు నిర్మించాలని సంకల్పించిది. అందులో భాగంగా నిర్మించిన రెండవ ఆలయమే మన హైదరాబాద్లోని బిర్లా మందిర్.
భాగ్యనగరం నడ్డిబొడ్డున కాలాపహాడ్ పైన బిరలా మందిర్ నిర్మాణానికి 1966లో భూమిపూజ చేశారు. మొత్తం పాలరాతితో నిర్మించిన ఈ ఆలయాన్ని పూర్తి చేయడానికి పది సంవత్సరాలు పట్టింది. అంటే 1976లో ఆలయం ప్రారంభం జరిగింది. త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారిచేత విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయించారు. ఈ ఆలయ నిర్మాణానికి 2వేల టన్నుల పాలరాతిని ఉపయోగించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక ఆలయ మూటవిరాట్ ను గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో లభించే నల్లరాతితో చెక్కించారు.
బిర్లామందిర్ ఆలయ నిర్మాణానికి అక్కడ తవ్వకాలు జరుపుతుంటే ఆ తవ్వకాల్లో దొరికిందట. దీంతో ఈ హనుమంతుడు స్వయంభూగా వెళిశాడని నమ్ముతారు. ఆదే విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించారట. ఇంకా 51 అడుగుల రాజగోపురం, గరుడ మందిరం తిరుమల ప్రధాన ఆలయానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ ఆలయ విమాన గోపరం పూరిజగన్నాథ క్షేత్రాన్ని తలపిస్తుంది. అలాగే ప్రధాన ద్వారం దాటి కొండ మీదకు వస్తున్న భక్తులకు 15 అడుగుల శ్రీకృష్ణుడి నల్లరాతి విగ్రహం దర్శనం ఇస్తూ భక్తులను ఆకట్టుకుంటుంది.
బిర్లామందిర్లో వ్యక్తిగతమైన అర్చనలు కానీ పూజలు కానీ అభిషేకాలు కానీ ఉండవు. ఇంకా చెప్పాలంటే గుడి నిర్మాణం చేసిన బిర్లా వంశస్థులకు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేయరట. ఏ పూజ చేసిన అది అంతా లోక కళ్యాణం కోసమే జరగాలట. ఇంకో విశేషం ఏంటంటే ఆగమశాస్త్రం ప్రకారం ఈ గుడిలో ఒక్క గంట కూడా ఉండదు..
ఇక్కడి శ్రీనివాసమూర్తికి చేయించే అభరణాలన్నీ తిరుమల శ్రీవారికి నగలు తయారే చేసే వారికే అప్పటిస్తారట. ఈ గుడిలో ఉన్న శఠగోపం శ్రీరంగంలోని రంగనాథ క్షేత్రం నుంచి తీసుకొచ్చారట. ఈ ఆలయాన్ని ప్రతి రోజు దాదాపు ఆరు వేల మంది, వీకెండ్స్ లో పది వేల మంది భక్తులు దర్శించుకుంటారట. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయం భక్తుల దర్శనార్థం తెరచి ఉంచుతారు.