Dharma Sandehalu: ఇల్లును చూసి ఇల్లాలని చూడమన్న సామెత ఒకటి ఉంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మంగళవారం నాడు భర్త పిల్లలు ఎవరు క్షవరం కానీ, గడ్డం కానీ చేసుకోవడం మంచిది కాదని చెప్పి మహిళలే నిలువరించాలి. అలా చేస్తే దరిద్రం వస్తుందన్న విషయాన్ని స్త్రీలు చెప్పాలి. ఇంట్లో చేసే మంచి పనులను శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే వరకు వచ్చే రోజులలోనే మంచి పనులు చేయాలి. స్త్రీలు పొరపాటున వారు కానీ, పిల్లలు కానీ దిండు పై కూర్చోకూడదు. నలుపు రంగు వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. స్త్రీలు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ఉప్పు, మిరప, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు. పక్కన పెడితే వాళ్లే తీసుకుంటారు.
ఇంట్లో మహిళలు ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.. అలా ఉంటే ఇంట్లో జేష్టాదేవి వచ్చి కూర్చుంటుందట.. శుక్రవారం నాడు కానీ, జీతం వచ్చిన రోజు కానీ ఆ డబ్బులతో మొదటిసారి ఉప్పు కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని, ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అంతేకాదు ఆడవాళ్లు కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్లు ఊపుతూ కూర్చోవడం నిషిద్దం. పెళ్లైన స్త్రీలు రాత్రివేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆహారం తినకుండా నిద్రించకూడదు. కొత్త బట్టలు ధరించేటప్పుడు పసుపు రాసుకోవాలి. ఇంట్లో దుమ్ము,ధూళి, సాలె పురుగులు దరిద్ర హేతువులు. కాబట్టి అవి ఇంట్లో లేకుండా చూసుకోవాలి.
పూలు అమ్మే వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నాకు వద్దు అని చెప్పకుండా, రేపు తీసుకుంటాను అని చెప్పడం మంచిది. మంగళ, శుక్రవారాల్లో ఇంటిలోని బూజు దులపకూడదు. ఎప్పుడూ స్త్రీల నోటి నుండి దరిద్రం, శని, పీడ, పీనుగ వంటి పదాలను పలకకూడదు. మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి. పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు. బాధలో ఉన్న కుటుంబాన్ని విచారించి అక్కడి నుంచి వెళ్లే స్త్రీలు వెళ్లి వస్తానని కూడా చెప్పకూడదు. పెళ్లయిన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు.