Big Stories

Pancharanga Kshetras : పంచరంగ క్షేత్రాల గురించి విన్నారా!

Pancharanga Kshetras : జలం ఏ పాత్రలోకి ఒంపితే, ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచుకోవాలనుకుంటే…. ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా ఆరాధించటం తెలిసిందే. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు మీకోసం..

- Advertisement -

శ్రీరంగపట్నం: ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్‌ గుర్తుకొస్తాడు. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నానికి అక్కడి దైవమైన రంగనాథుని మూలంగానే ఈ పేరు వచ్చింది. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్‌ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే!

- Advertisement -

తిరుప్పునగర్‌: తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలోని ఈ గ్రామంలో కొలువై ఉన్న స్వామి పేరు ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక వృద్ధునిగా దర్శనమిచ్చాడట. ఆ ముదుసలిని చూసిన రాజు.. జాలిపడి ఆహారం పెట్టగా.. ఎంత తిన్నా ఆయన ఆకలి తీరలేదట. చివరికి పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలు వడ్డించగా.. స్వామి తృప్తి పడ్డాడట. నాటినుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఈ క్షేత్రం ఒకటిగా ఉంది.

కుంబకోణం: ఒకప్పుడు హేమ రుషి సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించాడట. దాంతో లక్ష్మీదేవి తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. దీంతో ఆమెను కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా! అందుకే.. ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు.

మయిలదుతురై: చంద్రుని తపస్సుకి మెచ్చి విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది. పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారట. ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడి స్వామి పేరు ‘పరిమళ పెరుమాళ్‌’. వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయంలోని స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం అనే సంగీత వాయిద్యంగా పుట్టిందని చెబుతారు.

శ్రీరంగం: పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగం (చివరి క్షేత్రం)గా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే! విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖురూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. విభీషణుడు ప్రతిష్టించిన మూర్తి గల ఈ ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే! ఈ ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధకెక్కిన ఈ ఆలయాన్ని దర్శించకుంటే సర్వశుభాలూ జరుగుతాయని నమ్మకం.

ఇవీ పంచరంగ క్షేత్రాల విశేషం. కొన్ని జాబితాలలో ఇందులోని కుంభకోణం బదులు వటనగరంలోని రంగనాథ పెరుమాళ్‌ ఆలయాన్ని పేర్కొంటూ ఉంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News