వాస్తు శాస్త్రాన్ని హిందూ ధర్మాలు నమ్ముతాయి. హిందూ మతాన్ని ఆచరించేవారు. వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ నుండి ఆహారం తినడం వరకు ప్రతిదానికి దిశ చాలా ముఖ్యం. వాస్తు శాస్త్ర ప్రకారం దక్షిణ దిశ వైపు ఆహారం తినడం అశుభం. అంటే దక్షిణ దిశ వైపు ముఖాన్ని పెట్టి కూర్చొని ఆహారం తినడం అనేది ఏ మాత్రం మంచిది కాదు.
దక్షిణ ముఖంగా కూర్చుని ఆహారం తింటే వ్యాధులు వస్తాయని చెబుతారు. ఎందుకంటే దేవత ఈ దిశలో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే దక్షిణం వైపు తిరిగి ఆహారం తింటే వ్యాధుల బారిన త్వరగా పడతారని అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం తప్పుడు దిశలో కూర్చునే ఆహారం తింటే వారి జీవితంలో దుఃఖము, పేదరికము, ఇబ్బందులు వంటివి పెరిగిపోయే అవకాశం ఎక్కువ.
ఏ దిశలో కూర్చోవాలి?
హిందూ పురాణాలు చెబుతున్న ప్రకారం ఆహారం తినడానికి ఉత్తమమైన దిశలు తూర్పు, ఉత్తరం. వీటిని అత్యంత పవిత్రమైన దిశలుగా చెబుతారు. ఉత్తరాన్ని సంపద పెంచే దిశగా చెబుతారు. కాబట్టి ఈ దిశకు వైపుగా ముఖాన్ని పెట్టి కూర్చొని ఆహారం తినడం వల్ల సంపదకు ఎలాంటి లోటు ఉండదని నమ్ముతారు. అలాగే వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంటి యజమాని ఎప్పుడూ ఉత్తరం వైపు తిరిగి ఆహారం తింటే మంచిది. దీనివల్ల ఆ ఇంటి ఆదాయం పెరుగుతుంది.
తూర్పుముఖంగా తింటే
వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశ సూర్యునికి చెందినది. మీరు తూర్పు దిశ వైపు తిరిగి ఆహారం తింటే మీకు ఎప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వారు కచ్చితంగా తూర్పువైపే కూర్చొని ఆహారం తినేందుకు ప్రయత్నించండి. ఈ దిశకు వైపుగా కూర్చుని ఆహారం తింటే వ్యాధులు త్వరగా నయమవుతాయని నమ్ముతారు. ఎందుకంటే ఇది ఆరోగ్యాన్ని అందించే దిశగా చెబుతారు.
పశ్చిమ వైపు కూర్చుంటే
వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ దిశ వైపు కూడా ఆహారం తినవచ్చు. పశ్చిమ దిశ వైపుగా ముఖాన్ని పెట్టి ఆహారం తినడం వల్ల పురోగతి లభిస్తుంది. మన మత గ్రంధాల ప్రకారం పశ్చిమ దిశను లాభ దిశగా చెబుతారు. పశ్చిమ వైపు ఎదురుగా ఆహారం తినడం అనేది ఆ ఇంట్లోనే వారికి పురోగతిని అందిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య ఇలా అన్నిట్లోనూ మీకు పురోగతి కావాలంటే పశ్చిమ వైపుగా కూర్చొని ఆహారాన్ని తినవచ్చు.
నాలుగు దిక్కులలో దక్షిణం తప్ప మిగతా మూడు దిక్కుల వైపు కూర్చొని ఆహారం తింటే అంతా మేలే జరుగుతుంది. కానీ దక్షిణం వైపు ముఖం పెట్టుకొని కూర్చొని ఆహారం తినకూడదు. ఎందుకంటే దక్షిణం యమరాజుకు చెందినది. పొరపాటున కూడా ఈ దిశ వైపుగా తిరిగి భోజనం చేయకండి. ముఖ్యంగా తల్లిదండ్రులు బతికి ఉన్నవారు ఈ దిశ వైపుగా కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే ఈ దిశ వైపుగా కూర్చుని తరచూ భోజనం చేస్తూ ఉంటే కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంట్లోని ప్రతి గది కూడా దానికి తగిన దిశలోనే ఉండాలి. ఇంట్లో భోజనాలు గదిని ఎప్పుడు పశ్చిమ దిశలోనే నిర్మించాలి. భోజనాల గది నిర్మించడం వల్ల ఆ ఇంట్లో ఆనందము పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆహారానికి, డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు.