Hindu Temple: పాకిస్తాన్లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో సుమారు 125 సంవత్సరాల నాటి పురాతన హిందూ ఆలయాన్ని కూల్చివేయడం తీవ్ర కలకలం రేపుతోంది. సమీపంలో ఉన్న ఒక మదర్సా విస్తరణ కోసమే ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ స్థానిక హిందువులు, మైనారిటీ సంఘాలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. ఆలయాన్ని యథాస్థానంలో పునర్నిర్మించాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
లాహోర్కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవాల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో ఈ పురాతన ఆలయం ఉండేది. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని ఆగస్టు 21న ‘తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్’ (TLP) అనే నిషేధిత తీవ్రవాద సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు కూల్చివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కనే ఉన్న ఇస్లామిక్ పాఠశాల విస్తరణలో భాగంగానే ఈ దారుణానికి ఒడిగట్టారని వారు పేర్కొన్నారు. కూల్చివేత అనంతరం ఆలయ శిఖరానికి ఉన్న లోహపు భాగాలు, ఇటుకలు, ఇతర నిర్మాణ సామగ్రిని కూడా అక్కడి నుండి మాయం చేశారని తెలిపారు.
ఈ ఘటనను స్థానిక రాజకీయ పార్టీ పాకిస్తాన్ మసీహా మిల్లత్ పార్టీ (PMMP) తీవ్రంగా తప్పుబట్టింది. ఆ పార్టీ ఛైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక యంత్రాగానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆలయానికి చెందిన భూమిని గతంలో ‘ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్’ (ETPB) మదర్సా కోసం లీజుకు ఇచ్చిందని, అయితే అద్దె చెల్లించకపోవడంతో జనవరి 29నే ఆ లీజును రద్దు చేస్తూ ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కానీ అధికారులు ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడం వల్లే ఈ కూల్చివేత జరిగిందని ఆరోపించారు.
మరోవైపు అక్కడి హిందూ సంఘం నేత రతన్ లాల్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం, ఈటీపీబీ ఆలయాన్ని పరిరక్షించడంలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఉన్న మదర్సా వల్ల.. స్థానిక హిందూ కమిటీ సభ్యులు ఆ స్థలాన్ని సందర్శించడానికి కూడా భయపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!
అయితే హిందూ సంఘాల ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారీ వర్షాల కారణంగానే ఈ పాత భవనం కూలిపోయిందని ఈటీపీబీ సీనియర్ అధికారి రాణా ఇఫ్తికార్ తెలిపారు. ఆలయ భూమిని ఎవరికీ లీజుకు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో ఆలయ భద్రతపై ముప్పు ఉందనే విషయం స్థానిక పోలీసులకు ముందుగానే తెలుసని ఆయన పేర్కొన్నారు. అటు ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఈటీపీబీ తెలిపింది.
Also Read: BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!