Battle for Hormuz: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ జ్వాలలు భగ్గుమన్నాయి. నెల రోజుల తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య దాడులు తీవ్రమవుతున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిలోని లారక్ ద్వీపంలోని ఇరాన్ రాకెట్ లాంచ్ వ్యవస్థపై అమెరికా దాడులకు దిగింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేసింది. అన్నట్లుగా రాత్రి జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై దాడులకు దిగింది. జరుగుతున్న పరిణామాలు యుద్ధం మళ్లీ తీవ్రంకావచ్చనే సంకేతాలు మొదలయ్యాయి.
జులై తర్వాత ఇరాన్పై అమెరికా మొట్టమొదటి దాడి చేసింది. ఆదివారం లారాక్ ద్వీపంలోని రెండు ఇరాన్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ వెల్లడించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్-ఐఆర్జీసీ దళాలు హోర్ముజ్ జలసంధిలోకి సముద్ర మైన్లతో కూడిన రాకెట్లను ప్రయోగించడానికి సిద్ధమవుతున్నట్లు గమనించిందని పేర్కొన్నారు. ఆ జలమార్గం గుండా జరిగే స్వేచ్ఛా వాణిజ్యాన్ని పరిరక్షించడానికి అమెరికా సైన్యం ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. గతవారం అమెరికా సైన్యం జలసంధిలోని అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాల నుంచి సముద్ర మైన్లను తొలగించే ప్రక్రియ పూర్తి చేసింది.
లారాక్ ప్రాంతం ఇరాన్కు చెందిన ఒక చిన్న ద్వీపం. బందర్ అబ్బాస్ తీరానికి దూరంగా ఖేష్మ్ ద్వీపానికి తూర్పు-హోర్ముజ్ ద్వీపానికి దక్షిణాన ఉంది. అమెరికా దాడిని తీవ్రంగా ఖండించింది ఇరాన్. లారక్ దాడిలో సైనిక సిబ్బందితోపాటు పౌరులు మరణించినట్లు, పలువురు గాయపడినట్లు వెల్లడించింది. ఈ దాడికి తప్పకుండా ప్రతిస్పందిస్తామని అమెరికాను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్-IRGC హెచ్చరించింది. ఆ హెచ్చరికకు తగినట్టుగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. జోర్డాన్లో అమెరికా బలగాలున్న కింగ్ హుస్సేన్-అల్ అజ్రాక్ స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ విషయాన్ని IRGC స్వయంగా ప్రకటించింది. ఈ దాడుల్లో రెండు స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆదేశ మీడియా తెలిపింది.
ఇరాన్ దాడులను గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ప్రకటించింది జోర్డాన్. ఎనిమిది క్షిపణులను తమ గగనతలంలో కూల్చివేశామని వెల్లడించింది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య దాడులు మళ్లీ తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ప్రయత్నంలో సైనిక చర్యలకు బదులుగా ఆర్థిక ఒత్తిడిని పెంచడంపై దృష్టి సారిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగింది. సముద్రంలో సీమైన్స్ తొలగించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు విప్పారు. ఈ క్రమంలో ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం తెల్సిందే.
కొత్తగా మందుపాతరలు అమర్చితే వాటిని ధ్వంసం చేస్తామని,ఈక్రమంలో తాజా దాడి జరిగినట్టు తెలుస్తోంది. అమెరికా- ఇరాన్ దాడులతో మళ్లీ హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే సమయంలో జలసంధిలోకి ప్రవేశించిన ఓ చమురు ట్యాంకర్ను క్షిపణి లేకుంటే డ్రోన్ తాకింది. అది ఏదేశం ప్రయోగించిందో తెలీదు. దీనిపై అమెరికా, ఇరాన్ నోరు మెదపలేదు. ఈ విషయాన్ని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. జరుగుతున్న పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.