America: ఇరాన్ యుద్ధం విషయంలో ఏం జరుగుతోంది? తొలుత భీకరమైన దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటన చేస్తున్నారు. కొద్ది గంటల్లో వెనక్కి తగ్గుతున్నారు. దీనివెనుక గడిచిన 24 గంటల్లో అసలేం జరుగుతోంది? ఇరాన్పై చేపట్టిన సైనిక దాడిని రద్దు చేస్తున్నట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఒప్పందం వేగంగా ఖరారైతే దాడులకు విరామం కొనసాగుతుందన్నారు.
ఇరాన్పై సైనిక దాడి వాయిదా పడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. మేము కొట్టే దెబ్బకి భరించలేమని వారు మమ్మల్ని వేడుకుంటారని తెలిపారు. ఐనప్పటికీ టెహ్రాన్పై దాడులు నిలిపి వేయాని నిర్ణయించుకున్నామని, ఒప్పందంలోని అంశాలపై ఒక అవగాహనకు వచ్చినందున దాడులను నిలిపివేయాలని ఇరాన్ సహా, గల్ఫ్ దేశాలు మమ్మల్ని కోరాయని వివరించారు. హోర్ముజ్ జలసంధిని తక్షణం ఓపెన్ చేయడం, ఇరాన్ అణు ముప్పును తొలగించడం సహా ఒప్పందం ముసాయిదాపై అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు.
ఈ విషయంలో అమెరికాతో ఇజ్రాయెల్ ఉందని తెలిపారు. ఈ ప్రకటనపై ఇరాన్ వెంటనే బహిరంగంగా స్పందించ లేదు. ఈ అభ్యర్థన ప్రపంచ భవిష్యత్ ప్రయోజనం, సంపన్నమైన ఇరాన్ మనుగడ, వేగంగా ఒప్పందం కుదుర్చుకోగలిగే షరతుకు లోబడి ఉంటే దాడిని రద్దు చేయడానికి అంగీకరించానని తెలిపారు. అంతకుముందు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. సంయమనం పాటించాలని ఇరాన్పై జరగబోయే పెద్ద దాడిని నివారించాలని విజ్ఞప్తి చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఇద్దరు నాయకులు శనివారం మాట్లాడుకున్నారని వైట్హౌస్ అధికారి ఒకరు తెలిపారు, కానీ వివరాలు వెల్లడించలేదు.
1. భద్రతా పరిస్థితి దిగజారితే మధ్యప్రాచ్యాన్ని విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని తమ పౌరులను కోరింది అమెరికా విదేశాంగ శాఖ. ఇరాన్పై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ సలహా వెలువడింది.
2. అమెరికా సైనిక దాడికి ప్రతిస్పందించడానికి టెహ్రాన్ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి. పాకిస్థాన్- టర్కీ నాయకులతో జరిపిన చర్చల్లో ఈ విషయాన్ని మరోసారి ఆయన వెల్లడించారు.
3. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక మేరకు.. ఇరాన్ నిరంతర దాడుల నుండి ఇజ్రాయెల్ను రక్షించడానికి నౌకా దళం వద్ద వనరులు సరిపోవు. ఈ విషయాన్ని ఓ సీనియర్ ఆర్మీ జనరల్ పెంటగాన్ను హెచ్చరించారు.
4. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవద్దని ఇరాన్కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సూచించారు. వాణిజ్య నౌకలు-నావికుల భద్రతను నిర్ధారించాలని కోరారు. పశ్చిమాసియా సంఘర్షణలో ఇప్పటివరకు 16 మంది భారతీయులు మరణించగా, 75 మంది గాయపడ్డారని ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది.
5. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం.. అమెరికా బెన్ గురియన్ విమానాశ్రయానికి మరో 10 ఇంధన సరఫరా విమానాలను పంపుతోందని కథనాలు వస్తున్నాయి. దీంతో అక్కడ విమానాల సంఖ్య 40కి చేరుతుంది. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక సంసిద్ధతను మరింత బలోపేతం చేస్తుందని అంచనా.
ALSO READ: ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్