Kia 2030 Strategy: భారత మార్కెట్లో మరింత సత్తా చాటేందుకు కియా ఇండియా కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్ తో పాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్జీ వెహికల్స్ పైనా దృష్టి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. 2030 నాటికి దేశంలో విక్రయించే 10 మోడళ్లలో 8 మోడళ్లను ఎలక్ట్రిఫైడ్ వాహనాలుగా మార్చాలనే లక్ష్యంతో కియా పని చేస్తోంది.
వినియోగదారులకు ఒకే రకమైన ఇంజిన్ కాకుండా, పలు రకాల పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ అందించాలని భావిస్తున్నట్లు కియా ఇండియా ఎగ్జిక్యూటివ్ అతుల్ సూద్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లు, అలాగే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ వేరియంట్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్ను బట్టి వారికి ఎక్కువ ఆప్షన్ ను ఉండేలా చూడాలనుకుంటున్నామని చెప్పారు.
ప్రస్తుతం కియా భారత మార్కెట్లో EV6, EV9, Carens Clavis EV, Syros EV అనే నాలుగు ఎలక్ట్రిక్ కార్లను అమ్ముతోంది. వీటికి తోడు సెల్టోస్కు స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీని భారత్ లోనే రూపొందించింది. తక్కువ ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంపై కంపెనీ దృష్టి పెట్టింది. అయితే, ఈ మోడల్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఇక భారత మార్కెట్లోకి త్వరలోనే మూడు వరుసల సీట్లతో కూడిన కియా సోరెంటో SUVని కూడా తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ మోడల్ ను భారత్లోనే అసెంబుల్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఇది కియా నుంచి భారత్ లో విడుదలయ్యే తొలి స్ట్రాంగ్ హైబ్రిడ్ SUVగా నిలవనుంది. అలాగే కియా కార్నివాల్ కు కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ అందించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న నాలుగు ఎలక్ట్రిక్ కార్లతో పాటు సెల్టోస్, సోరెంటో, కార్నివాల్ హైబ్రిడ్ మోడళ్లు కలిపి మొత్తం ఏడు ఎలక్ట్రిఫైడ్ వాహనాలు కియా లైనప్ లో ఉంటాయి. దీంతో 2030 నాటికి ఎనిమిది ఎలక్ట్రిఫైడ్ మోడళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి సోనెట్, సైరోస్ లాంటి మరో కాంపాక్ట్ SUVకి కూడా హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకురావచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, ఫ్యాక్టరీలోనే అమర్చే సీఎన్జీ కార్లను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం కేరెన్స్ మోడల్కు మాత్రమే డీలర్ స్థాయిలో సీఎన్జీ కిట్ అందుబాటులో ఉంది. కానీ, భవిష్యత్తులో నేరుగా ఫ్యాక్టరీ నుంచి సీఎన్జీ వేరియంట్లను విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అవి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయనే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: ఔనా.. నిజమా? EV కారుగా అంబాసిడర్ రీఎంట్రీ?