Coal mine blast: పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అదే బొగ్గు గనిలో జరిగితే దాని నష్టం అంతా ఇంతా కాదు. అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది మృత్యువాత పడ్డారు. మరో 10 మంది ఇరుక్కుపోయారు. ఈ ఘటన పాకిస్థాన్లో జరిగింది.
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 32 మంది కార్మికులు మృతి చెందారు. మరో 10 మంది గని లోపల చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలువుర్ని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఘటన ఎలా చోటు చేసుకుంది? బొగ్గు గనిలో మీథేన్ వాయువు పేరుకు పోవడంతో పేలుడు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు.
పేలుడు జరిగిన కొన్ని గంటల తర్వాత ఏడుగురి మృతదేహాలను వెలికి తీసినట్టు తెలిపారు. అత్యవసర సహాయక బృందాలు మరో 25 మృతదేహాలను కనుగొన్నాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. చిక్కుకుపోయిన కార్మికులను గుర్తించి వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. పేలుడు తర్వాత గనిలో ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా తగ్గిపోయినట్టు చెబుతున్నారు. సజీవంగా కార్మికులు బయటడే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. గనిలో ఇంకా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. సిబ్బంది అత్యంత జాగ్రత్తగా లోపలికి వెళ్తున్నట్లు తెలిపారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బలూచిస్తాన్ ప్రావెన్సులో బొగ్గు గనుల్లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గనులలో తగినంత వెంటిలేషన్ లేకపోవడం, గ్యాస్ పర్యవేక్షణ వ్యవస్థలు, ఇతర భద్రతా చర్యలు పెద్దగా ఉండవు. ఘటన జరిగితే పదుల సంఖ్యలో అక్కడ కార్మికులు మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయి. భద్రతా నిబంధనలను అమలు చేయడంలో గనుల యజమానులు విఫలమవుతున్నారని కార్మిక సంఘాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. పాకిస్తాన్లో అత్యంత వెనుకబడిన బలూచిస్తాన్లో వేలాది మంది గని కార్మికులు తమ జీవనోపాధి కోసం బొగ్గు పరిశ్రమపై ఆధారపడుతున్న సంగతి తెల్సిందే.
ALSO READ: కొత్త మలుపు తిరిగిన అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, ఇరాన్పై మెరుపుదాడులు