Iran Vs America: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం గాలివానలా మారుతోంది. ఆ రెండు దేశాలు ఎప్పుడు దాడులకు దిగుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా అమెరికా మెరుపు దాడులతో ఇరాన్ దద్దరిల్లింది. దక్షిణ ఇరాన్లోని కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతమంతా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
ఇరాన్-అమెరికా దాడులు కొత్త మలుపు-అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తలు పతాకస్థాయి చేరాయి. అమెరికా సైన్యం చేస్తున్న దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. జోర్డాన్లోని తమ స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేయడంతో అమెరికా రగిలిపోయింది. ఫలితంగా ప్రతీకార దాడులకు దిగింది. శక్తిమంతమైన దాడులు జరుగుతున్నాయని యూఎస్ సైన్యం వెల్లడించింది. ఇరాన్లోని రెవల్యూషనరీ గార్డ్కు చెందిన స్థావరాలపై దాడులు జరిపింది అమెరికా. సైనిక కేంద్రాలు, మిసైల్, డ్రోన్ సదుపాయాలు, తీర రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది అమెరికా సెంట్రల్ కమాండ్. అబాదాన్, బుషెహర్, కిష్, క్విష్మ్ దీవులు, ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్టు ఇరాన్ మీడియా స్వయంగా వెల్లడించింది.
ఇరాన్ పై దాడులతో విరుచుకుపడిన అమెరికా-అమెరికా దాడుల్లో క్విష్మ్ దీవిలోని పలు నివాసాలు దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇద్దరు అక్కడి ప్రజలను రక్షించి ఆసుపత్రికి తరలించాయి. ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా బలగాలపై దాడులకు ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు. అమెరికా బలగాలు స్పందించి ఆత్మరక్షణ చర్యలు చేపట్టాయని, ఇరాన్కు కచ్చితంగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఆయన ప్రకటన చేసిన కొద్దిసేపటికి వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి.
జోర్డాన్పై ఇరాన్ దాడులతో రగిలిపోయిన అమెరికా-రెండురోజుల కిందట జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఆసియా ప్రాంతంలో చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా, పాలస్తీనా ప్రజలకు మద్దతుగా బాలిస్టిక్ క్షిపణి దాడులు చేశామని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఇంతకాలం ఇరాన్-అమెరికా మధ్య పరిమితమైన యుద్ధం బుధవారం కొత్త మలుపు తిరిగింది. ఈజిప్ట్లోని డమియెట్టా పోర్ట్లో అమెరికాకు చెందిన గ్యాస్ ట్యాంకర్పై డ్రోన్ దాడి జరిగింది. ఎల్ఎన్జీ లోడింగ్, ఇతర ప్రక్రియలు జరుగుతున్న వేళ దాడి జరగడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు కూడా విస్తరించాయి.
ALSO READ: జపాన్ను వణికించిన భారీ భూకంపం.. తీవ్రత 7.1 గా నమోదు, వందలాది బుల్లెట్ రైళ్లు రద్దు
పరిస్థితి గమనించిన అత్యవసర సహాయక బృందాలు సైనికులను అక్కడి నుంచి తరలించాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం కాస్త ఇంధన నిల్వలున్న మరో దేశానికి ఘర్షణలు విస్తరించాయి. దీంతో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుందోనన్న ఆందోళన తీవ్రమవుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న దాడులు ప్రపంచ శాంతికి పెను ముప్పుగా మారింది. ఈ ఉద్రిక్త పరిణామాలు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతోంది.