Bhogapuram Facts: భోగాపురం.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ఈ ప్రాంతం దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అయితే, భోగాపురం కేవలం కొత్త ఎయిర్ పోర్ట్ కే పరిమితం కాదు. దీనికి వందల ఏళ్ల చరిత్రతో పాటు, వేల సంవత్సరాల నాటి సాంస్కృతిక వారసత్వం ఉంది. ఇంతకీ అదేంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
‘భోగాపురం’ అనే పేరు రెండు పదాల కలయిక. భోగ అంటే సంపద, సుఖసంతోషాలు, ఐశ్వర్యం. పురం అంటే ఊరు లేదంటే పట్టణం. ఈ రెండింటిని కలిపితే సంపదతో విలసిల్లిన ఊరు అనే అర్థం వస్తుంది. ఈ పేరు ఎలా వచ్చిందనే విషయంపై అధికారిక ఆధారాలు లేకపోయినా, స్థానికంగా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. విజయనగరం సంస్థానాన్ని పాలించిన పూసపాటి రాజుల కాలంలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని చెబుతారు. రాజ కుటుంబాలకు చెందిన వారు నివసించడం, వ్యవసాయం, వ్యాపారం బాగా ఉండటం వల్ల ప్రజలు సుఖశాంతులతో జీవించేవారని, అందుకే దీనికి భోగాపురం అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు.
భోగాపురం పరిసర ప్రాంతాల్లో చరిత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా గోస్తనీ నది ఒడ్డున ఉన్న గుడివాడ దిబ్బ పురావస్తు ప్రాంతం ఎంతో ప్రాచీనమైనది. భారత పురావస్తు సర్వేక్షణ శాఖ నిర్వహించిన తవ్వకాలలో ఇక్కడ బౌద్ధ స్థూపం, విహారం, సభామండపం లాంటి నిర్మాణాల అవశేషాలు బయటపడ్డాయి. ఇవి క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తుశకం రెండో శతాబ్దం మధ్యకాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఆ రోజుల్లో గోస్తనీ నది మార్గంగా సమీపంలోని భీమిలి, కళింగపట్నం ఓడరేవుల నుంచి విదేశాలకు సముద్ర వ్యాపారం జరిగేది. ఆ ప్రయాణాల్లో బౌద్ధ భిక్షువులు, వ్యాపారులు ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకునేవారని చరిత్రకారులు చెప్తున్నారు.
భోగాపురానికి దగ్గరలోనే ఉన్న భీమునిపట్నం ప్రస్తుత భీమిలి కూడా చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. ఇది భారతదేశంలోని అత్యంత పురాతన మునిసిపాలిటీలలో ఒకటి. ఇక్కడ డచ్ కోట, డచ్ సమాధులు, పాత లైట్ హౌస్ లాంటి అనేక చారిత్రక కట్టడాలు ఇప్పటికీ కనిపిస్తాయి. అలాగే తోట్లకొండ, పావురాళ్లకొండ లాంటి ప్రాంతాల్లో పురాతన బౌద్ధ క్షేత్రాల ఆనవాళ్లు ఉన్నాయి. మరోవైపు పద్మనాభం యుద్ధం కూడా ఈ ప్రాంత చరిత్రలో ముఖ్య ఘట్టంగా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో మరోసారి వార్తల్లో నిలిచింది. సుమారు రూ.4,700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనుంది. విశాఖపట్నం విమానాశ్రయంపై రద్దీ ఒత్తిడి తగ్గడంతో పాటు పరిశ్రమలు, పర్యాటకం, వాణిజ్య రంగాలకు కూడా ఊతమివ్వనుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విమానం ఎక్కాల్సిన అవసరం లేకుండానే సాధారణ సందర్శకులు కూడా విమానాశ్రయం పరిసర ప్రాంతాలను వెళ్లి చూడవచ్చు. సో, భోగాపురం ఇకపై కేవలం విమానాశ్రయం ఉన్న ఊరే కాదు.. చరిత్ర, సంస్కృతి, ఆధునిక అభివృద్ధి కలిసిన ప్రత్యేక ప్రాంతంగా గుర్తింపు పొందనుంది.
Read Also: భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకంత ప్రత్యేకం? మీకు తెలియని ఇంట్రస్టింగ్ విశేషాలు ఇవే!