Tihar Jail: స్వేచ్ఛ బ్యూరో: జైలు కూడు తినలేక పోతున్నాను.. నా వంట నేనే చేసుకుని తింటా.. అనుమతించండంటూ ఉగ్ర ఆరోపణలపై అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అమెరికన్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైలు భోజనంలో మసాలా, కారం, నూనె ఎక్కువగా ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఆ భోజనం తినలేక యాభై రోజులుగా పస్తులు ఉంటున్నట్టు తెలిపాడు.
ఆ ఖర్చు ఏదో నేనే భరిస్తా..
వంట చేసుకునేందుకు కావాల్సిన సరకులు, వంటపాత్రలు అందుబాటులో ఉంచాలని అభ్యర్థించాడు. ఇందుకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని కూడా తెలిపాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడనన్న అభియోగంపై ఎన్ఐఏ అధికారులు మార్చి నెలలో అమెరికాకు చెందిన వాన్ డైక్ను అరెస్టు చేశారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అతను తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు.
నా వంట నేనే చేసుకుంటా..
కాగా, జైల్లో ఇస్తున్న భోజనం తినటం తన వల్ల కావటం లేదని వాన్ డైక్ కోర్టులో పిటిషన్ వేశాడు. భారతీయ ఆహారం తనకు అలవాటు లేదని తెలిపాడు. ఫలితంగా పస్తులు ఉండాల్సి వస్తోందని తెలియచేశాడు. ఈ నేపథ్యంలో పధ్నాలుగు కిలోల బరువు తగ్గానని, పోషకాహారం లేకపోవడంతో కంటిచూపు కూడా తగ్గిందని పేర్కొన్నాడు. మానవతా ధృక్పథంతో జైల్లో తన వంట తానే చేసుకోవడానికి అనుమతించాలని అభ్యర్థించాడు.
ఇండక్షన్ కుక్కర్, ఇతర వంట పాత్రలు
పప్పు, రెడ్ మీట్, చికెన్, చేపలు, పాస్తా, నూడుల్స్, బియ్యం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బ్రెడ్, బటర్ వంటివి అందుబాటులో ఉంచేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరాడు. ఆలివ్ ఆయిల్, టోన్డ్ మిల్క్ కావాలని అడిగాడు. ఇండక్షన్ కుక్కర్, ఇతర వంట పాత్రలు ఇవ్వాలని పేర్కొన్నాడు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై స్పందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసింది.
Also Read: కాంగ్రెస్ నేతలకు ‘కంటి ఆపరేషన్’ చేయించాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!