Bangladesh Violence: బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? భారత్కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా? అక్కడి హిందువులను టార్గెట్ చేశారా? రెండు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రత్యర్థులు ఆ తరహా స్కెచ్ వేశారా? పొరుగుదేశాలతో బంగ్లా పెద్దలు చేతులు కలిపారా? చంద్రదాస్ని అర్ధరాత్రి దారుణంగా చంపాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? దీని వెనుక అసలు కారణాలేంటి?
బంగ్లాదేశ్లో అదే పరిస్థితి
బంగ్లాదేశ్లో నిరసనలు కేవలం హిందువులను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. హాది మరణంపై ఒక్కసారిగా అక్కడి ప్రజల్లో ఆందోళనలు మిన్నంటాయి. మత విద్వేషం ముసుగులో హిందూ యువకుడి దారుణహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యకు కారణమని చెబుతున్న మత దూషణ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నది ప్రాథమిక విచారణ. మరి అయితే హిందూ వ్యక్తిని ఎందుకు అల్లరి మూకలు అత్యంత దారుణంగా చంపేశారు అన్నదే అసలు ప్రశ్న.
డిసెంబర్ 18 రాత్రి మైమెన్సింగ్లో హిందూ యువకుడు దీపు చంద్రదాస్ని మతోన్మాదులు అత్యంత క్రూరంగా కొట్టి చంపేశారు. ఇస్లాం మతాన్ని కించపరిచాడంటూ సహాద్యోగి ఆరోపణలు చేశాడు. దీంతో అతడు పని చేసిన బట్టల ఫ్యాకర్టీ బయట దారుణంగా కొట్టి చంపారు నిరసనకారులు. చంద్రదాస్ చంపి మృతదేహాన్నిచెట్టుకు వేలాడ దీసి నిప్పుపెట్టారంటే అక్కడ పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
హిందూ యువకుడి హత్య వెనుక, ఆ రాత్రి ఏం జరిగింది?
ఈ ఘటనపై బంగ్లాదేశ్కి చెందిన రాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్ మహ్మద్ సంచలన విషయాలు బయటపెట్టాడు. చంద్రదాస్ తన సోషల్ మీడియాలో మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఎలాంటి పోస్ట్లు లేదా కామెంట్స్ చేయలేదన్నారు. మతాన్ని విమర్శించడం తాము విన్నామని చెప్పే వ్యక్తి ఒక్కరు కూడా బయటకు రాలేదన్నారు.
ఫ్యాక్టరీలో గొడవ జరుగుతున్నప్పుడు కంపెనీకి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో బలవంతంగా బయటకు నెట్టేశారని తెలిపారు. ఆ తర్వాత ఊహించని ఘోరం జరిగిందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అక్కడి పోలీసులు దృష్టి సారించారు. మొత్తం ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. మరో 10 మందిని విచారిస్తున్నారు. ఇది పోలీసుల వెర్షన్.
ALSO READ: వీర్ ఛైర్లో స్పేస్లోకి.. చరిత్ర సృష్టించిన దివ్యాంగురాలు
ఇక బాధితుడి తండ్రి రవిలాల్ దాస్ కొన్ని విషయాలు బయటపెట్టారు. తాత్కాలిక ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఈ హత్యాకాండను ఖండించింది. చర్య తీసుకోవడానికి ఆదేశించినప్పటికీ బాధితుడి తండ్రి నిరాశ వ్యక్తం చేశాడు. తన కొడుకు హత్య వార్త మొదట ఫేస్బుక్ ద్వారా తెలిసిందన్నాడు. అరగంట తర్వాత మా బంధువు వచ్చి తన కొడుకును తీసుకెళ్లి చెట్టుకు కట్టేశారని గుర్తు చేశాడు.
ఆ తర్వాత చంపేశారని తెలిపాడు. తన కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించారని, సగం సగం కాలిన శరీరాన్ని బయటే వదిలేశారని కన్నీరుమున్నీరు అయ్యాడు. కాలిన మొండెం, తలను బయట కట్టేశారని ఇది చాలా భయంకరమని అన్నాడు. దీంతో దీపు చంద్రదాస్ హత్య అక్కడి హిందూ మైనారిటీల దుస్థితి ప్రపంచానికి తెలిసిందన్నాడు. మరోవైపు అక్కడ జరుగుతున్న పరిణామాలను భారత్ గమనిస్తోంది.